ధర్మపురి సంజయ్కు బెయిల్ తిరస్కరణ, మరో బెయిల్ పిటిషన్ ఆలోచన
నిజామాబాద్: రాజ్యసభ సభ్యులు డీ శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ బెయిల్ సోమవారం తిరస్కరణకు గురైంది. జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఆయన బెయిల్ను తిరస్కరించింది. బెయిల్ తిరస్కరించడంతో మరో బెయిల్ పిటిషన్ వేసే ఆలోచనలో సంజయ్ తరఫు న్యాయవాది ఉన్నారు.
శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థినులపై లైంగిక ఆరోపణల కేసులో సంజయ్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అతనిపై నిర్భయ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సంజయ్పై 342, 354, 354A, 506, 509, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. సంజయ్ని ఏసీపీ సుదర్శన్ విచారించారు. ఆయనపై వచ్చిన ఆరోపణల మీద ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్టు చేశారు.
నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ను పోలీసులు వారం క్రితం అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఆయన గత ఆదివారం నిజామాబాద్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయనను సుదీర్ఘంగా మూడు గంటల పాటు విచారించారు. మధ్యలో ఓసారి బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత మరోసారి విచారించారు. అనంతరం అతనిని అరెస్టు చేశారు.
ఆ తర్వాత అతనిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆదివారం కావడంతో ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరిచి అనంతరం రిమాండుకు తరలించారు.