తెలంగాణలోని ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కరీంనగర్, మహబూబ్నగర్, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది.
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో మరో వారం రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలోనూ శుక్రవారం రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చినుకులు పడుతున్నాయి.

కాగా, ఇటీవల కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలు అస్తవ్యస్థంగా మారింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ఈ అత్యంత భారీ వర్షాలు ప్రభావం ఎక్కువగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇప్పటికే మోరంచ లాంటి గ్రామాలు వరద ప్రభావం నుంచి కోలుకోలేదు.
తెలంగాణ వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాల కారణంగా 41 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది పశువులు మృత్యువాత పడ్డాయి. పదుల సంఖ్యలో ఇళ్లు పూర్తగా ధ్వంసమయ్యాయి. పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వరదనీటిలోనే ఆహారం పదార్థాలు, ఇంట్లోని సామాగ్రి, డబ్బులు కొట్టుకుపోవడంతో మోరంచ గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే వరద సాయం కోసం ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తమకు ఇప్పటికైతే ప్రభుత్వ సాయం అందలేదని వరద బాధిత ప్రజలు అంటున్నారు.












Click it and Unblock the Notifications