ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల, రేసులో గుత్తా
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల జాతర జరుగుతుంది. ఇవాళే స్థానిక సంస్థల తుది విడత పోలింగ్ ముగిసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతోపాటు ఖాళీగా ఉన్న ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 7 పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొంది.

మైనంపల్లి రాజీనామాతో ..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు పదవీకి రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేయడంతో ... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం కోసం టీఆర్ఎస్లో ఆశావాహులు చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పట్నం మహేందర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డిని ప్రకటించడంతో మిగిలిన వారికి సీటు కేటాయించే అవకాశం ఉంది.

రేసులో గుత్తా
ఈ స్థానంలో గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా నుంచి పోటీచేయమని కేసీఆర్, కేటీఆర్ కోరినా .. ఆయన విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోటా అభ్యర్థిత్వం దాదాపు ఆయన ఖరారయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మిగతా నేతల నుంచి పోటీ ఎదుర్కొంటే బలమైన నేత వైపు టీఆర్ఎస్ హై కమాండ్ మొగ్గుచూపే అవకాశం ఉంటుంది.

21న నోటిఫికేషన్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక కోసం ఈ నెల 21న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుల చేస్తోంది. జూన్ 7న పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ మే 28గా నిర్ణయించారు. 29న నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 31న నామినేషన్ల ఉపసంహకరణకు చివరతేదీగా నిర్ణయించారు. జూన్ 7న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని .. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications