ఎయిర్పోర్టులో భార్యాబిడ్డలను వదిలి చెక్కేసిన ఎన్నారై టెక్కీ అరెస్టు
భార్యను, తొమ్మిదేళ్ల కుమారుడిని విమానాశ్రయంలో వదిలేసి వెళ్లిపోయిన ఎన్నారై టెక్కీ కీర్తిసాయి రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: భార్యను, తొమ్మిది నెలల కుమారుడిని శంషాబాద్ విమానాశ్రయంలో వదిలేసి చెక్కేసిన ఎన్నారై టెక్కీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నెల రోజుల క్రితం జరిగింది. అమెరికాలో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న వై. కీర్తిసాయి రెడ్డి తన భార్యను, కుమారుడిని శంషాబాద్ విమానాశ్రయంలో వదిలేసి వెళ్లిపోయాడు.
దానిపై అతని అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఎన్నారై టెక్కీ భార్య శిరీషను ఆమె అత్త కూడా వేధించినట్లు, కుమారుడికి పాలు పట్టగూడదని ఆంక్షలు విధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
కీర్తిసాయికి, శిరీషకు 2015 ఏప్రిల్లో వివాహం జరిగింది. కీర్తిసాయి రెడ్డి అమెరికాలోని వర్జీనియాలో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయెట్ అయిన శిరీష ఇంట్లోనే ఉంటూ వస్తోంది. ఆమెకు కొడుకు పుట్టిన తర్వాత వేధింపులు ప్రారంభమయ్యాయి. ఆమెపై అనుమానంతో భర్త వేధించడం ప్రారంభించాడు.
ఈలోగా కీర్తిసాయి రెడ్డి తల్లి వనిత కూడా అమెరికా వెళ్లింది. ఆమె కూడా శిరీషను వేధించడం మొదలు పెట్టింది. ఆ వేధింపులు భరించలేని శిరీష తన తల్లికి విషయం చెప్పింది.. దాంతో శిరీష తల్లి హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు ఎన్జీవో సాయంతో జనవరిలో ఫిర్యాదు చేసింది.
ఫిబ్రవరిలో కిర్తీసాయి రెడ్డి, శిరీష హైదరాబాదు వచ్చారు. అయితే, కీర్తిసాయి రెడ్డి శిరీషను, కుమారుడిని విమానాశ్రయంలో వదిలేసి తల్లితో వెళ్లిపోయాడు. ఎఎస్ఐ ధన్ సింగ్ సాయంతో శిరీష వనస్థలిపురంలోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. పోలీసులు ఇరు పక్షాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. కీర్తి సాయిరెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.