మళ్లీ తెరపైకి ఎన్టీఆర్ పేరు: కేసీఆర్కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ టెర్మినల్కు దివంగత ఎన్టీఆర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి సీఎం కేసీఆర్ను లేఖ ద్వారా కోరారు.
తెలుగు ప్రజలకు ఎనలేని సేవ చేసిన ఎన్టీఆర్కు కొత్త రాష్ట్రమైన తెలంగాణలో సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని లేఖలో పేర్కొన్నారు. గతంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్రం తీర్మానించిన విషయాన్ని కూడా అందులో ప్రస్తావించారు.
తెలంగాణ అభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన సేవలకు గుర్తుగా దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పెరు పెట్టడం సముచితమని పేర్కొన్నారు. శంషాబాద్లోని దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడం వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ పెరుగుతుందని లేఖలో ప్రస్తావించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఆయనకు ఎన్టీఆర్పై ఎంత గౌరవముందో స్పష్టమైందని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను, సిద్ధాంతాలను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు.
అందువల్ల శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్రెడ్డి కోరారు. ''నా అభిమాన నటులు ఎన్టీ రామారావుగారు. ఆయన తనయుడు బాలకృష్ణ అంటే నాకు ప్రీతిపాత్రులు. ఒకప్పుడు మనల్ని 'మదరాసీయులు' అని పిలిచేవారు.
తెలుగువారిని అలా పిలవకూడదంటూ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన ఘనత ఆయనది. ఎన్టీఆర్ ఒక తరం నటులు కారు, తెలుగుజాతి గర్వించదగ్గ బిడ్డ. ఆయన్ని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకుంటారు'' అంటూ బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే.