వికారాబాద్ లో క్షుద్రపూజల కలకలం: పుర్రె, విగ్రహం లభ్యం; గుప్తనిధుల కోసమే!!
శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. ఎక్కడ చూసినా మూఢనమ్మకాలను విశ్వసిస్తున్న వారు కనిపిస్తున్నారు. ముగ్గులేసి, కోళ్ళు బలిచ్చి ఎక్కడ పడితే అక్కడ ఇటీవల కాలంలో క్షుద్ర పూజలు పెరిగిపోయాయి. నేటి హైటెక్ సమాజంలోనూ క్షుద్ర పూజలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మంత్ర తంత్రాలు, గుప్త నిధుల పేరుతో క్షుద్ర పూజలు, చేతబడి, బాణామతి వంటి మూఢనమ్మకాలు ఇంకా ప్రజలను వేధిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి, పాలేపల్లి గ్రామాల మధ్య ఉన్న ఓన్నవ్వ దేవాలయం ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహించారని తెలుస్తుంది.
కొండయపల్లిలోని పోచమ్మ ఆలయం సమీపంలో దేవాలయం ఎదుట క్షుద్ర పూజలు నిర్వహించి తవ్వకాలు జరిపిన వారు బడెంపల్లిలోని గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గుండాల గ్రామ శివారులో కొందరు వ్యక్తులు గుప్తనిధుల కోసం రాత్రివేళల్లో క్షుద్ర పూజలు నిర్వహించి తవ్వకాలు జరపగా,ఈ తవ్వకాలలో ఓ విగ్రహం లభించినట్లు గ్రామస్తులు అనుమానించి అధికారులకు సమాచారం అందించారు.
దీంతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి ఓ కారులో గుప్తనిధుల వెలికితీసిన విగ్రహాన్ని గుర్తించారు. అయితే గుప్త నిధుల తవ్వకాల విగ్రహంతో పాటు ఒక పుర్రె కూడా లభ్యమైనట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇటీవల వారం రోజుల క్రితం ఖమ్మం నాచారం గ్రామం చెరువు దగ్గర ఉన్న అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడం స్థానికంగా కలకలం రేపింది. గ్రామాలలోని కాదు పట్టణాల్లో సైతం ఇటీవల మూఢనమ్మకాలను విశ్వసిస్తున్న వారు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నారు.
ఏది ఏమైనప్పటికీ క్షుద్రపూజలను, బాణామతి, చేతబడి వంటి మూఢనమ్మకాలను విశ్వసిస్తున్న ప్రజలు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు మూఢనమ్మకాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. మూఢ నమ్మకాలతో మానసిక శారీరక, రుగ్మతలకు గురికాకుండా వారిలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.