ఆకాంక్షాలు ఆచరణలో - పదేళ్ల తెలంగాణ ప్రస్థానంలో..!!
సుదీర్ఘ పోరాటం..ఎందరో త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ పదేళ్ల కాలంలో ఉద్యమ సారధిగా నాడు..ముఖ్యమంత్రిగా నేడు కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో మార్పులు వచ్చాయి.
తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పదేళ్ల ప్రస్థానం కొనసాగింది. అన్ని రంగాల్లోనూ అమలు చేసిన వ్యూహాత్మక ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ సమయంలో తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు సర్వం సిద్దమైంది.

తెలంగాణ పదేళ్ల ప్రస్థానం:నాడు ఉద్యమ వీరుడిగా తెలంగాణ కోసం పోరాటానికి కేసీఆర్ ముందుండి నడిపించారు. రాష్ట్రం సాధించిన నేతగా కేసీఆర్ కు ప్రజలు ఎన్నికల్లో పట్టం కట్టారు. జూన్ 2, 2014న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసారు. అప్పుడు మాత్రమే కాదు, 2018 ఎన్నికల్లోనూ తిరిగి కేసీఆర్ కే పట్టం కట్టారు.
ఈ ఏడాది జూన్ 2కి తెలంగాణ ఆవిర్భవించి పదేళ్ల కాలం పూర్తవుతోంది. తెలంగాణ ఎందుకు కోరుకున్నదీ..ప్రత్యేక రాష్రంగా ఎలా ఎదిగిందీ..సాధించిన విజయాలు ఏంటనేది ప్రతిబిబించేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాదు ఈ ఉత్సవాలు జరుగుతాయి.

ఎన్నో నిర్ణయాలు..విజయాలు:తెలంగాణ ఏర్పడితే విద్యుత్ కొరత తప్పదనే విమర్శలకు..ఇప్పుడు 24 గంటల నిరంతర విద్యుత్ సమాధానంగా నిలిచింది. రాష్ట్ర విభజన జరిగితే నీటి యుద్దాలు తప్పవనే వ్యాఖ్యలను తిప్పి కొట్టేలా ఎత్తిపోతల పథకాలు.. డ్యామ్ లు..మిషన్ భగీరధ...మిషన్ కాకతీయ వంటి నిర్ణయాలతో ప్రతీ ప్రాంతంలో చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏకంగా 20 లక్షలకు పైగా కొత్తగా సాగునీరు అందుతోంది. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా ఎదిగింది. రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. మెట్రో విస్తరణ పెరిగింది. నగరం విస్తరించింది. పెట్టుబడులకు చిరునామాగా తెలంగాణ నిలుస్తోంది. అనేక కీలక రంగాల్లో పెట్టుబడులు..ఉపాధి అవకాశాలు పెరిగాయి. జీఎస్డీపీ లో తెలంగాణ అగ్రభాగాన నిలుస్తోంది.

మారిపోయిన రూపురేఖలు:తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ లో తాజాగా ప్రారంభమైన నిర్మాణాలు బ్రాండ్ ను మరింత పెంచాయి. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం.. అద్భుత నిర్మాణంగా సచివాలయం.. అమరవీరుల స్థూపం వంటికి భాగ్యనగరానికి ఐకాన్ గా మారాయి. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా దశాబ్ది ఉత్సవాల నిర్వహణ జరగనుంది.
తెలంగాణ సాధించిన పురోగతిని ఒక లోగోలోనే అర్దమయ్యేలా రూపొందించారు. తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకం, కాళేశ్వరం, విద్యుత్తు, వ్యవసాయం, మిషన్ భగీరథ, సాంస్కృతిక, యాదాద్రి, మెట్రో రైలు, టీ-హబ్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం మొదలైన చిహ్నాలతో ఈ లోగో రూపొందించారు.

దశాబ్ది ఉత్సవాల వేళ:దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో భాగంగా అమరవీరులను స్మరించుకునేందుకు ఒకరోజును ప్రత్యేకంగా 'మార్టియర్స్ డే'గా జరిపి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమరుల స్థూపాలను అలంకరించి తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ నివాళులు అర్పించడం. జాతీయ జెండాను ఎగురవేసి, అమరుల త్యాగాలను స్మరిస్తూ తుపాకీ పేల్చి పోలీసులు అధికారికంగా గౌరవ వందనం సమర్పిస్తారు. తెలంగాణ ప్రస్థానంపై డాక్యుమెంటరీ సిద్దం చేసారు.
2014 జూన్ 2 నుండి 2023 జూన్ 2 దాకా స్వయంపాలనలో సాగిన సుపరిపాలన అది సాధించిన ప్రగతితో రూపొందించారు. జూన్ 2న సచివాలయంలో జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. జూన్ 3 తెలంగాణ రైతు దినోత్సవం, 4న సురక్షదినోత్సవం, 5న విద్యుత్ విజయోత్సవం, 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న తాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండగ, 9న సంక్షేమ సంబరాలు, 10న సుపరిపాలన దినోత్సవం, 11న తెలంగాణ సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్ నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications