ఓట్ల పంట పండేనా, కేసీఆర్ బిగ్ స్కెచ్ - అదిరిపోయే హామీలు..!!
తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. 115 స్థానాలకు అభ్యర్థులను అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రకటించింది. గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ అధికారం ఖాయమనే ధీమాతో ఉంది. ప్రధాని ప్రకటించిన తాజా వరాలతో బీజేపీ ఆశలు పెరుగుతున్నాయి. ఈ సమయంలోనే హ్యాట్రిక్ పైన కన్నేసిన సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేలా భారీ స్కెచ్ సిద్దం చేసారు. దీంతో, తెలంగాణ ప్రజల మద్దతు దక్కెదెవరికి..గెలుపెవరిది.
తెలంగాణలో ఎన్నికలు
తెలంగాణలో ఎన్నికల కోడ్ మొదలైంది. ఇక ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు పార్టీలు రంగంలోకి దిగాయి. అభ్యర్దుల ప్రకటన..ప్రచారంతో అధికార బీఆర్ఎస్ దూకుడు మీద ఉంది. కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్దుల జాబితా తుది కసరత్తు చేస్తున్నాయి. పలు సంస్థలు ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.

కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ హోరా హోరీ తప్పదనే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ సమయంలోనే సోనియా తెలంగాణ ప్రజల కోసం ప్రకటించిన గ్యారంటీ పథకాలు తమకు ఓట్లు తెచ్చి పెడతాయనేది ఆ పార్టీ నేతల విశ్వాసం. ఈ సమయంలో తెలంగాణలో మహిళా ఓటర్లే లక్ష్యంగా కాంగ్రెస్ పథకాలకు కౌంటర్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకర్షణీయ నిర్ణయాలతో ముందుకు వస్తున్నారు.
రైతుబంధు పెంపు
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు కింద అందిస్తున్న ఆర్థికసాయాన్ని మరో 50 శాతం పెంచనున్నట్లు సమాచారం. దాంతోపాటు.. రైతుల కోసం ఉచిత ఎరువుల పథకాన్ని కూడా ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు కూడా ప్రస్తుతం అందిస్తున్నదానికంటే కొంత అదనంగా కలిపి అందించాలని.. మేనిఫెస్టో కమిటీ నిర్ణయించినట్టు సమాచారం.
ప్రస్తుతం రైతుబంధు పథకం కిందఎకరానికి ఏడాదికి ఇస్తున్న రూ.10 వేల మొత్తాన్ని రూ. 15 వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని ప్రకటించిన కేసీఆర్ సర్కారు.. ఎకరానికి, ఒక పంటకు రూ. 4 వేల చొప్పున ఏడాదికి రూ. 8 వేలు చెల్లించింది. 2018- 19 యాసంగి రైతుబంధును నవంబరు నెలలో పోలింగ్ సమయంలో ఖాతాల్లో జమచేయటంతో అప్పటి టీఆర్ఎ్సకు ఓట్ల పంట పండింది. ఈ సారి రైతు బంధు కింద ఒక పంటకు ఎకరానికి రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు పంపిణీ చేస్తామని మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు సమాచారం. ఎకరానికి 2 బస్తాల చొప్పున యూరియా ఉచితం రైతులకు అందించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.
బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
దివ్యాంగులకు ప్రస్తుతం అందిస్తున్న రూ.3,016 పింఛన్కు అదనంగా మరో రూ.1000 కలిపి నెలకు రూ.4,116లను పింఛన్గా అందిస్తామని ప్రకటించింది. ఇదే క్రమంలో ఆసరా పింఛన్లను కూడా పెంచి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆసరా పింఛన్ల కింద అందిస్తున్న రూ.2,016కు మరో వెయ్యి జోడించి.. రూ.3,016అందించాలని నిర్ణయించినట్టు సమాచారం.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1,01,116 నగదు సాయాన్ని 20-30 శాతం మేర పెంచి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను కలిపి అర్హులైన అందరికీ ఆరోగ్య భరోసా పేరుతో రూ.10 లక్షలతో 'హెల్త్కార్డు'ను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటి ద్వారా హ్యాట్రిక్ విజయం ఖాయం చేసుకొనే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.












Click it and Unblock the Notifications