జగన్ ముందే ఔట్, బాబు మెతక, జానా భోజనం: కెసిఆర్‌కు వరమా?

హైదరాబాద్: ప్రతిపక్షాల అగ్రనేత బలహీనతలే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రికి అనుకూలంగా మారుతున్నాయా అనే ప్రశ్న ఉదయిస్తోంది. గ్రేటర్ హైదరాబాదుపై ఇప్పటికే గులాబీ జెండా ఎగిరిందని కెసిఆర్ ఏ విశ్వాసంతో అన్నారనేది చర్చనీయాంశంగా మారింది. జిహెచ్ఎంసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ఆయన తనయుడు, ఐటి శాఖ మంత్రి కెటి రామరావు మొదటి నుంచీ చెబుతున్నారు.

జిహెచ్ఎంసిలో అసలే ప్రాతినిధ్యం లేని తెరాస ఒక్కసారిగా అధికారాన్ని చేపడుతుందా అనే సందేహాలకు కెసిఆర్ ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందే చేతులెత్తేసి గ్రేటర్ బరి నుంచి తప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28, 29 తేదీల్లో గ్రేటర్ హైదరాబాదులో ప్రచారం చేసినప్పటికీ కెసిఆర్‌ను పల్లెత్తు మాట అనలేకపోయారు. ధీటుగా కెసిఆర్‌ను ఎదుర్కోవడానికి సిద్ధపడిన కాంగ్రెసు పార్టీకి ఐదు రూపాయల భోజనం చేయడం ద్వారా జానా రెడ్డి షాక్ ఇచ్చారు.

Weekend: హాట్ అండ్ హీట్

అవన్నీ తెరాసకు ఈ ఎన్నికల్లో పరోక్షంగా కలిసి వస్తాయని భావిస్తున్నారు. తెరాస మొదటి నుంచి సీమాంధ్ర ఓటర్లపై గురి పెట్టినట్లు కనిపిస్తోంది. హైదరాబాదులో సీమాంధ్ర ఓట్లే నిర్ణయాత్మక పాషించే అవకాశం ఉందని భావించి, ఆ వ్యూహానికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. తాము పోటీ చేస్తే సీమాంధ్ర ఓట్లు చీలి తెరాసకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే జగన్ తన పార్టీని పోటీకి దించలేదనే పుకార్లు ఉన్నాయి. వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో పోటీ చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమాంధ్రుల ఓట్లు దండిగా ఉన్న హైదరాబాదులో పోటీ చేయకపోవడం వెనక మతలబు అదేనని అంటున్నారు.

Opposition leaders weakness may KCR strength

కాగా, కెసిఆర్‌ను ధీటుగా ఎదుర్కోకపోవడానికి చంద్రబాబుకు ఉన్న కారణం గురించి అందరూ మాట్లాడుకుంటున్న విషయమే. రెండు రోజుల ప్రచారంలో హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని, తాను ఇక్కడే ఉంటానని, అర్థరాత్రి పిలిచినా వస్తానని చంద్రబాబు చెప్పారు. టిడిపి తరఫున గెలిచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలను చంద్రబాబు దూషించారే గానీ వారిని పార్టీలో చేర్చుకున్న కెసిఆర్‌ను నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేకపోయారు. కెసిఆర్ మాత్రం 28వ తేదీన మీడియా సమావేశం పెట్టి చంద్రబాబుకు చురకలంటించారు. చంద్రబాబుకు ఇక్కడేం పని అని కెసిఆర్ అంటే, తనకు ఇక్కడేం పని అని కొందరంటున్నారని, తాను హైదరాబాదులోనే ఉంటానని చాలా మెత్తగా జవాబు ఇచ్చారు.

నిజానికి, రాజకీయ ప్రత్యర్థులకు అంత సుతిమెత్తగా సమాధానం చెప్పే స్వభావం చంద్రబాబుది కాదు. తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడుతారు. కానీ కెసిఆర్ విషయంలో చాలా మెత్తగా వ్యవహరించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇది తెలుగుదేశం, బిజెపి కూటమికి ఉపయోగపడకపోగా, నష్టం చేసే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి రోహిత్ ఆత్మహత్య తర్వాత సంభవించిన పరిణామాలతో హైదరాబాదులో ప్రధాన భామిక పోషించాల్సిన కేంద్ర మంత్రి, బిజెపి నేత బండారు దత్తాత్రేయ వెనకబడిపోయారు.

ఇక, జానా రెడ్డి రూటే వేరు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ నాయకులు ఊరంతా నోరు చేసుకుని కెసిఆర్‌పై విమర్శలు చేస్తుంటే, ఆయన చాలా తాపీగా పేదల కోసం కేసిఆర్ ప్రభుత్వం పేదలకు ఐదు రూపాయలకు అందిస్తున్న భోజనాన్ని తెప్పించుకుని తిని కితాబు ఇచ్చేశారు. ఇది కాంగ్రెసు నాయకులకు మింగుడుపడడం లేదు.

ఇక, మజ్లీస్ తమకు ఇప్పటికీ మిత్రపక్షమేనని కెసిఆర్ స్వయంగా చెప్పారు. ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకపోయినప్పటికీ ఫలితాలు వెలువడిన తర్వాత తెరాస మజ్లీస్ సహకారం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. మజ్లీస్ కనీసం 40, 50 మధ్య సీట్లు గెలుస్తుందనే అంచనా ఉంది. మొత్తం 150 సీట్లను మిగతా ప్రధాన పార్టీలన్నీ పంచుకోవాల్సి ఉంటుంది. పంచుకునే సీట్లలో మెజారిటీ వాటా తమదేననే ధీమాతో కెసిఆర్ ఉన్నారు.

తెరాస నాయకులు కూడా అభ్యర్థులు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నాయకుల గురించి చెప్పకుండా కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, అమలు చేయబోయే పథకాలను ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. కెసిఆర్‌ను బలపరచడానికి జిహెఎంసి ఎన్నికల్లో తెరాసను గెలిపించడం అవసరమని నొక్కి చెబుతూ ముందుకు సాగుతున్నారు. ఇదంతా కెసిఆర్‌కు కలిసి వస్తుందా, లేదా అనేది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+