కెసిఆర్తో ఢీ: పొత్తు పొడుపు చర్చలు, ఉత్తమ్తో ఎర్రబెల్లి భేటీ
హైదరాబాద్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) చేతిలో చావు దెబ్బ తిన్న ప్రతిపక్షాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ కలిసి టిఆర్ఎస్ను ఎదుర్కోవడానికి ప్రాతిపదికను తయారు చేసుకుంటున్నాయి. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెసు అభ్యర్థిగా ముందుకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ తనకు టిడిపి మద్దతు ఇస్తుందని చెప్పారు.
టిఆర్ఎస్ స్థానిక సంస్థల కోటా కింద ఎన్నికలు జరుగుతున్న 12 స్థానాలకు కూడా పోటీ చేయాలని భావిస్తోంది. ఈ స్థితిలో టిడిపితో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్న కాంగ్రెసు అందుకు అవసరమైన ప్రయత్నాలను ప్రారంభించింది. కాంగ్రెసు ఇప్పటికే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండ స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిజామాబాద్ స్థానానికి వెంకట్రామి రెడ్డి, రంగారెడ్డి స్థానానికి ఎ. చంద్రశేఖర్, మహబూబ్నగర్ స్థానానికి కూచుమల్ల దామోదర్ రెడ్డిని పోటీకి దించాలని నిర్ణయించింది. మిగతా అభ్యర్థుల పేర్లు ఈ రాత్రికి ఖరారయ్యే అవకాశం ఉంది.
ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో సిపిఐ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెసు నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని టిడిపి కూడా కాంగ్రెసు ముందు ప్రతిపాదించింది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని సోమవారంనాడు టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కలిశారు. కలిసి పనిచేస్తే రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానాల్లో టిఆర్ఎస్ను ఓడించడానికి వీలవుతుందని ఇరువురు నాయకులు కూడా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
అయితే, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానాలను చెరొకటి పంచుకోవాలనే ప్రతిపాదన టిడిపి నుంచి కాంగ్రెసు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, టిడిపి ప్రతిపాదనను కాంగ్రెసు జిల్లా నాయకులు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దాంతో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోమారు మంగళవారం సమావేశమయ్యే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 9వ తేదీన నామినేషన్ల గడువు పూర్తవుతుంది. డిసెంబర్ 27వ తేదీన పోలింగ్ జరుగుతుంది. స్థానిక సంస్థల కోటా కింద ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో స్తానానికి, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.