ఓయూలో రాహుల్ ఎంట్రీకి నో పర్మిషన్ -ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం : కాంగ్రెస్ ఆందోళన..!!
ఉస్మానియా యానివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కీలక నిర్ణయం ప్రకటించింది. రాహల్ గాంధీ యూనివర్సిటీలో సభకు..సమావేశాలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా మే 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించాలని నిర్ణయించారు. ఇందు కోసం ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఉస్మానియా వీసీ ని కలిసి అనుమతి కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. రాజకీయ సభలు కాదని..కేవలం రాహుల్ విద్యార్ధులతో ముఖా ముఖి సమావేశమై..వారి ఇబ్బందుల గురించి తెలుసుకుంటారని అందులో వివరించారు.
అదే సమయంలో టీఆర్ఎస్ అనుబంధ సంఘాలు వీసీని కలిసి రాహుల్ సభకు అనుమతి ఇవ్వద్దంటూ కోరాయి. ఇక, ఈ మొత్తం వివాదం పైన చర్చించిన యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇక నుంచి ఓయూ ప్రాంగణంలో ఎటువంటి రాజకీయ సమావేశాలు - సభ లకు అనుమతి లేదని స్పష్టం చేసింది. వర్సిటీ ప్రాంగణంలోకి కెమేరాలను సైం అనుమతించమని తేల్చి చెప్పింది. దీని పైన కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీకి వెళ్లేందుకు ఎవరికైన అధికారం ఉంటుందని..విద్యార్ధుల కష్టాలు తెలుసుకోవటానికి మాత్రమే రాహుల్ యూనివర్సిటీకి వస్తున్నారని చెబుతున్నారు.
ఎటువంటి రాజకీయ సభలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ రాహుల్ యూనివర్సిటీకి వెళ్తే..నిరుద్యోగ యువతకు తాము చేసిన అన్యాయం పైన మాట్లాడుతారనే భయంతోనే వర్సిటీ పాలకవర్గం పైన ఒత్తిడి తెచ్చి అనుమతి ఇవ్వకుండా చూస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే, ఇదే అంశం పైన ఇప్పటికే నిరుద్యోగ జేఏసీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఇక, ఇప్పుడు యూనివర్సిటీ రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరించటంతో..ఏ రకంగా ముందుకు వెళ్లాలనే అంశం పైన టీపీసీసీ నిర్ణయం తీసుకోనుంది.
నిరుద్యోగ జేఏసీ కోర్టు వేసిన పిటీషన్ పైన తీర్పు వచ్చే వరకు వేడి చూడటమా..లేక, తామే కోర్టుకు వెళ్లి అనుమతి కోరటమా అనే అంశం పైన ఈ రోజు లేదా రేపు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక, వరంగల్ సభ సక్సెస్ చేసేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించారు. రాహుల్ సభకు లక్షలాదిగా తరలి రావాలని..పార్టీ శ్రేణులను కోరుతున్నారు. యూనివర్సిటీలో రాహుల్ కార్యక్రమం ఏర్పాటుకు అవకాశం లేకపోతే...విద్యార్దులతో ఏ విధంగా రాహుల్ సమావేశం ఏర్పాటు చేయాలనే అంశం పైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.