వరి వెయ్యాలా.. వద్దా? తెలంగాణాలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ; కన్ఫ్యూజన్ లో రైతులు!!
ఆరుగాలం శ్రమించి, అతివృష్టి,అనావృష్టిలను తట్టుకొని, ప్రకృతి విపత్తులను ఎదుర్కొని పంటలు పండించి; పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అరిగోస పడుతున్న రైతులకు ఇప్పుడు కొత్తగా వరి గోస మొదలైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వరి పంట సాగు చెయ్యొద్దని ప్రభుత్వం, వరి సాగు చేసుకోవాలని సూచిస్తూ ప్రతిపక్షాలు ప్రచ్ఛన్న యుద్ధానికి దిగడం రైతులను అయోమయానికి గురి చేస్తుంది. ఇంతకీ వరిసాగు చేయాలా వద్దా అన్నది రైతుల ముందున్న ప్రధాన సమస్య.
వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే.. వరి సాగు వద్దంటూ సడన్ గా నిర్ణయం మార్చుకున్న సర్కార్
టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రాష్ట్రంలో వరి పంట సాగు చెయ్యొద్దని, వరి వేస్తే ఉరివేసుకున్నట్టే అని, ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని వ్యాఖ్యలు చేశారు. గతేడాది వరకు వరి సాగును ప్రోత్సహించిన ప్రభుత్వం ఒక్కసారిగా వరిసాగు చేయొద్దని చెప్పడం రైతులకు ఏమాత్రం అర్థం కావడం లేదు. ఒకవేళ ఎవరైనా వరి సాగు చేస్తే ఆ వడ్లను కొనేదే లేదని సర్కారు తేల్చి చెప్పడం ఇప్పుడు అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది.
గతంలో ప్రాజెక్టులు లేక, నీటి సౌకర్యం లేక తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో ఆరుతడి పంటలు సాగుచేశారు. ఆ సమయంలోనూ తెలంగాణ రైతాంగం పెట్టుబడి ఎక్కువ పెట్టి తగినంత దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయింది. ఇక నీటి సౌకర్యం వచ్చిన తర్వాత వరి సాగు మొదలుపెట్టిన రైతాంగాన్ని మొన్నటి వరకు ప్రోత్సహించిన ప్రభుత్వం ఒక్కసారిగా మాట మార్చింది.
యాసంగిలో వరి సాగు చేస్తే కొనుగోలు చెయ్యబోం అని తేల్చి చెప్తున్న సర్కార్
వరి సాగులో మేమే నంబర్ వన్ అని గొప్పలు చెప్పుకుంటూనే ఒక్కసారిగా వరి పంట సాగు చేయొద్దని చెప్పడం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కూడా వరి పంట సాగు చేయొద్దని ఒకవేళ సాగు చేస్తే వడ్లు కొనుగోలు చేసేదే లేదని కరాఖండిగా తేల్చి చెబుతున్నారు. ఈ యాసంగిలో వరి సాగు చేయకుండా వ్యవసాయ శాఖ అధికారులకు కూడా కఠిన ఆదేశాలు జారీ చేశారు. తమ భూమి స్వభావాన్ని బట్టి, తమకు నచ్చిన పంటలను పండించుకునే రైతన్నల స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని వరి సాగు చేయవద్దని సీఎం కేసీఆర్ హరిస్తున్నారు అన్న చర్చ జరుగుతుంది.
వరి సాగు చేసుకోవాలని, ప్రభుత్వం మెడలు వంచైనా ధాన్యం కొనిపిస్తామని చెప్తున్న బండి సంజయ్
ఇదిలా ఉంటే వరి సాగు చెయ్యొద్దని కెసిఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ వరి సాగు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామంటూ వ్యాఖ్యానిస్తున్నారు. వరి సాగు చేస్తే కేంద్రం ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతోందని, అందుకే తాము వరి పంటను సాగు చెయ్యొద్దని చెబుతున్నామని, కేంద్రం తీరుతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా సీఎం కేసీఆర్ కేంద్రాన్ని ఈ వ్యవహారంలో ఇరికించారు. అయితే వరి కొంటారో లేదో కేసీఆర్ చెప్పాలని, కేంద్రం పై నెపం మోపటం సమంజసం కాదని మండిపడుతున్న బీజేపీ నేతలు, రైతులకు వరి సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఎవరి మాట వినాలో అర్ధం కాక ఇబ్బంది పడుతున్న అన్నదాతలు
ప్రతిపక్ష బీజేపీ మాటలు నమ్మి వరి సాగు చేయాలా? లేక ధాన్యం కొనుగోలు చెయ్యమని ప్రభుత్వం చెబుతున్న మాటలు విని ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలా అన్నది ప్రస్తుతం రైతులకు అంతుచిక్కకుండా ఉంది. రాష్ట్రంలో అవసరాలకు మించి వరి సాగు జరుగుతుంటే, రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించేలా చేయాల్సిన ప్రభుత్వం, వారిలో అవగాహన తీసుకురావడంతో పాటుగా, ప్రత్యామ్నాయ పంటలకు పలు ప్రోత్సాహకాలను ఇచ్చి రైతులను నిదానంగా మార్చాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా తెలంగాణ అన్నపూర్ణ అని చెప్పుకోవడం కోసం ముందు రైతులను వరి సాగు చేయడం పైన ప్రోత్సహించి, ఇప్పుడు ఒక్కసారిగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, వరి సాగు చేస్తే కొనుగోలు చెయ్యబోమని చెప్పడం ఇబ్బందికర పరిణామం .
రైతులకు నచ్చని ప్రభుత్వ నిర్ణయం..
వరి పంట సాగు చేస్తే ఊరుకోబోమని ఒకరు, వరి సాగు చేసుకోవచ్చని మరొకరు తమ తమ రాజకీయ లబ్ధి కోసం పోరాటం చేస్తుంటే, ఆవులు ఆవులు కొట్లాడుకుంటే లేగల కాళ్లు విరిగినట్టు ఉంది పరిస్థితి. ఏదేమైనా రాజకీయ పార్టీలు తమ లబ్దికోసం రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు అనే భావన వ్యక్తమౌతుంది. రైతులకు మాత్రం మిగతా పంటల సాగు కంటే వరి పంటలోనే కాస్త ఎక్కువ లాభం వస్తుంది. సాగు ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ కారణంగా రైతులు వరి పంట సాగు చేయడంపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ఒక పక్క ప్రభుత్వం వరి సాగు చేయ వద్దని గట్టిగా చెప్పడం రైతులకు ఏమాత్రం డైజెస్ట్ కావడం లేదు.
Recommended Video
ప్రత్యామ్నాయ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ఇస్తేనే రైతుల్లో మార్పు
ప్రత్యామ్నాయ వ్యవసాయ మార్గాలు చూపించి, ప్రోత్సహకాలు ఇచ్చి ప్రణాళికాబద్ధంగా విధానంగా వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకుంటూ పోతే తప్ప ప్రత్యామ్నాయ వ్యవసాయంపై రైతుల దృష్టి మళ్లేలా కనిపించడం లేదు. ఏది ఏమైనా ప్రస్తుతం వరి సాగు విషయంలో ఏం చేయాలో వద్దో అర్థం కాని పరిస్థితుల్లో తెలంగాణ రైతులు తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు. ఈ వ్యవహారంలో ముందు ముందు ఏం జరుగుతుందో అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణా ప్రభుత్వం సడన్ గా వ్యవసాయం పై ఆంక్షలు విధిస్తూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని తెలంగాణా రైతులు తప్పుబడుతున్నారు.