Kaushik Reddy : టీఆర్ఎస్లో చేరికకు ముహూర్తం ఖరారు... హుజురాబాద్ గులాబీ అభ్యర్థి కౌశిక్ రెడ్డే...?
ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరే ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 21న కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన తన అనుచరులు,మద్దతుదారులతో కలిసి ఆయన పార్టీలో చేరనున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. నిజానికి ఈ నెల 16వ తేదీనే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాలతో అది వాయిదా పడినట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ టికెట్ ఖరారైనట్లేనా..?
కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడం ఖరారైందని తెలుస్తున్నప్పటికీ... ఆ పార్టీ తరుపున హుజురాబాద్ టికెట్ దక్కుతుందా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. కౌశిక్ రెడ్డి బేషరతుగా పార్టీలో చేరుతున్నారా లేక హుజురాబాద్ టికెట్ హామీ మేరకే గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. బహుశా టికెట్ హామీ మేరకే ఆయన టీఆర్ఎస్లో చేరుతున్నారన్న ప్రచారం లేకపోలేదు. హుజురాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి కోసం ఇప్పటికే పలువురి పేర్లను కేసీఆర్ పరిశీలించారు. కానీ అనుకున్నంత స్థాయిలో సంతృప్తి చెందలేదు. దీంతో కౌశిక్ రెడ్డికే టికెట్ కేటాయించబోతున్నారా అన్న చర్చ జరుగుతోంది.
ఆ ఫోన్ కాల్ లీక్తో కాంగ్రెస్కు దూరం...
నిన్న,మొన్నటిదాకా కాంగ్రెస్లో కొనసాగిన కౌశిక్ రెడ్డి అనూహ్య పరిణామాలతో ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. 'టీఆర్ఎస్ టికెట్ నాకే ఖరారైంది...' అంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో లీకవడంతో కాంగ్రెస్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీలో కొనసాగుతూ ప్రత్యర్థి పార్టీ టికెట్ దక్కిందని ప్రచారం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వకుండానే కౌశిక్ రెడ్డి పార్టీ నుంచి తప్పుకున్నారు. ఆ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్కి రూ.50 కోట్లు ముట్టజెప్పి రేవంత్ ఆ పదవి దక్కించుకున్నారని ఆరోపించారు.
ఎట్టకేలకు గులాబీ గూటికే...
కౌశిక్ రెడ్డి ఆడియో లీక్తో ఆయన రాజకీయ భవితవ్యం డైలమాలో పడినట్లయింది. అటు కాంగ్రెస్కు దూరమై... ఇటు టీఆర్ఎస్ టికెట్ దక్కుతుందో లేదో తెలియని సందిగ్ధంలో పడ్డారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన రెండు,మూడు రోజుల్లోనే రాజకీయ భవిష్యత్పై ప్రకటన ఉంటుందని చెప్పినప్పటికీ... ఇప్పటివరకూ మళ్లీ ఆయన మీడియా ముందుకు రాలేదు.
దీంతో కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ కూడా దూరం పెడుతోందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఒకానొక దశలో కౌశిక్ రెడ్డి వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్సార్టీపీ వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ ఎట్టకేలకు ఆయన గులాబీ గూటికే చేరబోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.