ఆడపిల్లలకు గుడ్న్యూస్.. తులం బంగారం కోసం అర్హులు ఎవరంటే?
తెలంగాణలో పేదపిల్లల వివాహం కోసం ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తోంది. డబ్బులను వారి ఖాతాల్లో వేసేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో వీటిని అమలు చేసింది. తాము అధికారంలోకి వస్తే లక్ష రూపాయల నగదుతోపాటు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికల ప్రచారం లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీంతో ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా? అంటూ ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఇచ్చిన హామీని అమలు చేస్తామని పరిగి కాంగ్రెస్ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి ప్రకటించారు.
తన నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. త్వరలోనే నగదుతోపాటు తులం బంగారం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారని, ప్రతి ఒక్కరికీ అందిస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేయడంలో జాప్యం చేయవద్దని, పేదల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని చెప్పారు. ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలవుతాయన్నారు. తులం బంగారానికి సంబంధించిన పథకం అమలు, విధివిధానాల రూపకల్పన జరుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.

అర్హులు ఎవరంటే..
తెలంగాణలో శాశ్వత నివాసి అవ్వాలి.
వధువుకు 18, వరుడుకు 21 సంవత్సరాలు నిండాలి.
దరఖాస్తుదారులు EBC, SC, ST, BC వర్గాలకు చెందినవారవ్వాలి.
కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షలకు లోపు ఉండాలి.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలను ప్రకటించింది. వీటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే ఇతర పథకాలను కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఇటీవలే సీఎం రేవంత్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications