తెలంగాణ విద్యార్థిని ప్రశ్నకు సవివరంగా బదులిచ్చిన ప్రధాని మోడీ
పరీక్షా పే చర్చలో తెలంగాణ రాష్ట్రం నుంచి రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన విద్యార్థిని అక్షర.. ప్రధాని మోడీని ప్రశ్నించింది.
న్యూఢిల్లీ: పరీక్షల సమయంలో విద్యార్థుల్లో నెలకొనే ఒత్తిడి తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షాపే చర్చను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన పరీక్షాపే చర్చ కార్యక్రమంలో విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు ప్రధాని మోడీ. అంతేగాక, వారు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

బహు భాషపై ప్రధాని మోడీని ప్రశ్నించిన తెలంగాణ విద్యార్థిని
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన విద్యార్థిని అక్షర.. ప్రధాని మోడీని ప్రశ్నించింది. బహు భాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాలని అడిగింది. దీనిపై మోడీ సవివరమైన సమాధానం ఇచ్చారు.
భాషలు నేర్చుకునేందుకు అర్హతలు అవసరం లేదన్న మోడీ
కార్మికులు నివసించే బస్తీలోని ఓ ఎనిమిదేళ్ల చిన్నారి.. మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాల, తమిళం మాట్లాడటం ఆశ్చర్యపరిచింది. అసలు ఆ బాలికకు అన్ని భాషలు మాట్లాడటం ఎలా సాధ్యమైందని ఆరా తీశాను. ఆ బాలిక ఇంటి పక్కనే నివసించే వ్యక్తులు ఒక్కో రాష్ట్రానికి చెందినవారు. ఎక్కడి నుంచో బతికేందుకు వచ్చినవారంతా ఒక దగ్గర నివసించడంతో ఆ చిన్నారి వారితో నిత్యం మాట్లాడుతుండేది. ఈ క్రమంలోనే ఆమెకు అన్ని భాషలు వచ్చాయి. ఆ చొరవ మెచ్చుకోదగినది. అన్ని భాషలు నేర్చుకోవడానికి ప్రత్యేక అర్హతలు ఉండాల్సిన అవసరం లేదు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు అని ప్రధాని మోడీ వివరించారు.
పరీక్షాపేలో గత ఏడాది కంటే రెండింతలు హాజరు
కాగా, ప్రపంచం యావరేజ్ అని పిలిచిన మన దేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోతోంది! కాబట్టి, మీ సామర్థ్యాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి అని ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నిర్వహించిన పరీక్ష పే చర్చ ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈవెంట్లో పాల్గొనేవారు రెండింతలు ఎక్కువయ్యారు. మొత్తం 38.8 లక్షల మంది (31.24 లక్షల మంది విద్యార్థులు, 5.6 లక్షల మంది ఉపాధ్యాయులు, 1.95 లక్షల మంది తల్లిదండ్రులు) వివిధ రాష్ట్ర బోర్డులు, సీబీఎస్ఈ, కేవీఎస్, ఎన్వీఎస్, ఇతర బోర్డుల నుంచి నమోదు చేసుకున్నారు. కాగా, గవర్నర్ తమిళిసైతోపాటు పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షా పే చర్చలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications