గుండెపోటుతో పటాన్చెరు ఎమ్మెల్యే కుమారుడి మృతి
హైదరాబాద్: పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (30) గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన హఠాన్మరణం చెందారు.
కిడ్నీలు పాడవటంతో విష్ణువర్ధన్ రెడ్డి ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా ఆయనకు కామెర్లు వచ్చాయి. ఈ క్రమంలో వైద్యులు విష్ణువర్ధన్కు డయాలసిస్ చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన వెంటిలేటర్పై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయారు.

విష్ణువర్ధన్ మృతదేహాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసానికి తీసుకువచ్చారు. కుమారుడి మృతితో మహిపాల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విష్ణువర్ధన్ చిన్న వయస్సులోనే మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు రాజకీయ పార్టీల నేతలు విష్ణువర్ధన్ రెడ్డికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
కాగా, ఇటీవల కాలంలో గుండెపోటుతో చనిపోతున్న యువకుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటివి యువత ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. సమతుల ఆహారం తీసుకోకపోవడం, సరైన వ్యాయమం లేకపోవడంతో చిన్నపెద్ద అని తేడా లేకుండా అందరికీ గుండెపోటు వస్తుందని పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications