తెలంగాణ పర్యటన వెనుక కొత్త వాదన, వెనుక కేసీఆర్!: కొండగట్టుకు రూ.11 లక్షల విరాళం
కరీంనగర్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటనపై తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ జనసేనానిపై నిప్పులు చెరిగారు. బీజేపీ కూడా అదే దారిలో నడుస్తోంది.
Recommended Video

జనసేనకు పార్టీ లోగో, జెండా ఉంటాయి కానీ, కార్యవర్గం లేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ సోమవారం అన్నారు. జనసేనను సినిమాతో పోల్చారు. అది విడుదల కాకముందే ఫెయిల్ అయిందని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ తెలంగాణ వ్యతిరేకి అని అభివర్ణించారు.

కేసీఆర్కు అనుకూలంగా ఓటు చీల్చేందుకే పవన్ కళ్యాణ్
తెలంగాణలో అధికార పార్టీ వ్యతిరేక ఓటును చీల్చడానికి టీఆర్ఎస్ పవన్ కళ్యాణ్ను ఓ అస్త్రంలా ప్రయోగిస్తుందని కృష్ణసాగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో కార్యకర్తలు లేరని, కేవలం తన ఫ్యాన్స్తోనే పవన్ హడావిడి చేస్తున్నారన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా ఆ విషయమై పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు.

కాంగ్రెస్దీ అదే అనుమానం
అంతకుముందు, పొన్నం ప్రభాకర్ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ - కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని, అందుకే తెలంగాణలో పర్యటిస్తున్నారని చెప్పారు. గతంలో కోదండరాంకు అనుమతివ్వని కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో విమర్శలు చేసిన పవన్కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.

ఆంజనేయుడి అనుగ్రహంతో పార్టీ స్థాపించా
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామిని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానన్నారు. స్వామి నన్న చల్లగా చూడాలని కోరుకున్నానని చెప్పారు. అంజనేయుడి అనుగ్రహంతోనే తాను పార్టీ స్థాపించానని చెప్పారు. ఈ స్వామి ఆశీస్సులతో 2009లో బతికిబట్ట కట్టానని చెప్పారు.

అంజన్న గుడికి రూ.11 లక్షల విరాళం
ఈ సందర్భంగా కొండగట్టు అంజన్న గుడికి పవన్ రూ.11 లక్షల విరాళం ఇచ్చారు. పవన్ పర్యటన సందర్భంగా అభిమానులు ఉత్సాహం కనబరిచారు. అతనిని చూసేందుకు ఎగబట్టారు. పవన్ కూడా అంజన్న గుడి వద్దకు చేరుకున్నాక తనను చూసేందుకు వచ్చిన అశేష అభిమానుల కోసం కారు పైకి ఎక్కి చేయి ఊపి, నమస్కారం చేసి కిందకు దిగారు.

ఎవరో పంపిస్తే పవన్ కళ్యాణ్ రారు
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ వెనుక ఎవరో ఉన్నారని వ్యాఖ్యానించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ అంటున్నారని, ఇదంతా వట్టి ప్రచారం అన్నారు. ఎవరో పంపిస్తే పవన్ కళ్యాణ్ రారని చెప్పారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్న నేపథ్యంలో మంచి చేసినప్పుడు ప్రభుత్వాన్ని పొగిడితే తప్పేమిటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications