పవన్ కల్యాణ్ టాప్ గేర్- రూట్ మ్యాప్ రెడీ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. ప్రచారం హోరెత్తుతోంది. ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పైచేయి సాధించడానికి మూడు పార్టీలు పెద్ద ఎత్తున వ్యూహ ప్రతివ్యూహాలను పూర్తి చేశాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. అనేక చోట్ల ఇప్పటికే ఇంటింటి ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
ఈ పరిస్థితుల మధ్య బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి.. తమ మిత్రపక్షం జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ నివాసంలో ఈ సమావేశం ఏర్పాటైంది. సుమారు గంట పాటు కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి రావాలని పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు. ఆయన మద్దతును కోరారు. దీనికి అనుకూలంగా స్పందించారు పవన్. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి అంగీకరించారు.

ఈ విషయాన్ని ఎన్. రామచందర్ రావు వెల్లడించారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే రెడీ అయింది. ఎల్లుండి అంటే.. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రచార బరిలో దిగనున్నారు పవన్ కల్యాణ్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. స్వయంగా బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొననున్నారు. బీజేపీ- జనసేన క్యాంపెయిన్ కు ఆయనే నాయకత్వాన్ని వహించనున్నారు.
బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరనున్నారు. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం, సీబీఐ ఇచ్చిన క్లీన్ చిట్, ఏపీలో నెలకొన్న తదనంతర పరిణామాలతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications