విద్యార్థుల కోసం పవన్ కళ్యాణ్ ట్వీట్: స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విద్యార్థుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ సమస్యకు పరిష్కారం లభించింది. తెలంగాణలోని పాఠశాల విద్యార్థుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సును నడిపించాలని పవన్ కళ్యాణ్.. ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని పల్లెచెల్కతండా, సరికొండ గ్రామాల విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్రహీంపట్నం, మేడిపల్లి వెళ్లాల్సి వస్తోందని.. బస్సు సౌకర్యం లేక ఆ విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రత్యేకించి బాలికలు అటవీ మార్గం మీదుగా పాఠశాలలకు వెళ్లి రావడం కష్టంగా ఉందని పేర్కొన్నారు.
రవాణా సౌకర్యం లేని కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ ట్వీట్కు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
దసరా సెలవుల నేపథ్యంలో సర్వీసును తాత్కాలికంగా నిలిపివేశామని.. సెలవులు ముగిశాక తిరిగి ఈ సర్వీసును పునరుద్ధరించామని సజ్జనార్ తెలిపారు. మంగళవారం ట్రాఫిక్ కారణంగా గంటన్నర ఆలస్యంగా నడిచిందని ఎండీ సజ్జనార్ వివరణ ఇచ్చారు.