సీనియర్లు vs రేవంత్.. నిన్న వీహెచ్,నేడు లేఖతో ట్విస్ట్ ఇచ్చిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్లో ముదురుతున్న రచ్చ...
టీపీసీసీ అధ్యక్ష పదవి రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య అంతరాలను మరోసారి బయటపెట్టింది. ఇప్పటివరకూ కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడు ఎవరన్నది వెల్లడించకపోయినప్పటికీ... ఎంపీ రేవంత్ రెడ్డి పేరు ఖరారైందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అనుకూల వర్గం,వ్యతిరేక వర్గం అన్న చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ను వ్యతిరేకిస్తున్నవారిలో పార్టీ సీనియర్లే ముందున్నారు. నిన్నటికి నిన్న సీనియర్ నేత వి.హనుమంతరావు రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించగా... తాజాగా మరో సీనియర్ నేత జగ్గారెడ్డి ఇదే అంశంపై అధిష్టానానికి లేఖ రాశారు.
ఏకాభిప్రాయంతోనే... జగ్గారెడ్డి ట్విస్ట్...
పీసీసీ ఎన్నిక విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని కోరుతూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,అగ్ర నేత రాహుల్ గాంధీ,పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్కు లేఖ రాశారు. నాగార్జున సాగర్ ఉపఎన్నిక వరకూ టీపీసీసీ చీఫ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు,సీనియర్లతో చర్చించిన తర్వాతే... వారి ఏకాభిప్రాయంతోనే పీసీసీ చీఫ్ పదవిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని లేఖలో పేర్కొన్నారు. రేవంత్కు పీసీసీ ఫిక్స్ అయిందన్న ప్రచారం నేపథ్యంలో దానికి బ్రేక్ వేసేందుకే జగ్గారెడ్డి ఈ లేఖ రాశారన్న చర్చ జరుగుతోంది.
రేవంత్కు బ్రేక్ వేసేందుకేనా..?
కాంగ్రెస్ పార్టీకి చెందిన 162 మంది నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే పీసీసీ పదవిపై నివేదిక తయారుచేసి అధిష్టానానికి సమర్పించామని ఇదివరకే మాణిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు. అయితే సీనియర్లతో చర్చించాకే పీసీసీపై నిర్ణయం తీసుకోవాలని జగ్గారెడ్డి అధిష్టానాన్ని కోరడం కొత్త చర్చకు తెరలేపింది. అంటే,వీహెచ్ లాగే జగ్గారెడ్డి కూడా మాణిక్కం ఠాగూర్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.పైగా సీనియర్ల ఏకాభిప్రాయంతోనే పీసీసీ చీఫ్ని ప్రకటించాలని జగ్గారెడ్డి కోరడం రేవంత్కు ఆ పదవి ఇవ్వొద్దన్న సంకేతాలు పంపించడమేనన్న చర్చ జరుగుతోంది. నిజానికి జగ్గారెడ్డి కూడా పీసీసీ పదవిపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. అయితే తన పేరు పరిశీలనలో లేదని తెలిసి తీవ్ర నిరాశ చెందారు.
వీహెచ్ వ్యాఖ్యలు తిప్పికొట్టిన మల్లు రవి...
వీహెచ్,జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేతలు ఇలా రేవంత్ పట్ల వ్యతిరేక స్వరం వినిపిస్తుంటే మల్లు రవి లాంటి సీనియర్ నేతలు మాత్రం వాళ్ల తీరును తప్పు పడుతున్నారు. తాజాగా మల్లు రవి మాట్లాడుతూ... ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితులలో ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలో పార్టీ అధిష్టానానికి తెలుసన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలు ఆధారంగా ఆరోపణలు చేయడం తగదన్నారు. తనతో పాటు 165 మంది నేతల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే మాణిక్కం ఠాగూర్ అధిష్టానానికి నివేదిక సమర్పించినట్లు చెప్పారు. నిజానికి ఇంత ప్రజాస్వామ్య బద్దంగా చర్చలు ఎన్నడూ జరగలేదన్నారు.
ఎంతసేపు రెడ్డి వర్గానికేనా... : వీహెచ్
శుక్రవారం(డిసెంబర్ 25) వీహెచ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన రేవంత్ లాంటి నేతలకు పీసీసీ పదవి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అదే జరిగితే తాను పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. ఎంతసేపు రెడ్డి సామాజికవర్గానికే పెద్ద పీట వేయడం తప్ప బీసీలకు అవకాశం ఇవ్వరా అని నిలదీశారు. ఒకవేళ మళ్లీ రెడ్డి వర్గానికే అవకాశమిచ్చినా ఒరిజినల్ రెడ్డికే ఇవ్వాలని అన్నారు. అంతేకాదు,పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ అమ్ముడుపోయారని ఆరోపించారు. రేవంత్కు అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించిన ఆయన... దానిపై సీబీఐకి లేఖ రాస్తానన్నారు. వీహెచ్ చేసిన ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగింది. పీసీసీ పదవి ప్రకటించకముందే కాంగ్రెస్లో ఇంత రచ్చ జరుగుతుండటంతో మున్ముందు ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న చర్చ జరుగుతోంది.