మాస్కులు పెట్టుకోవటం మరచిపోయిన జనం.. కరోనా విజృంభిస్తున్నా లేని భయం!!
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ డోసులు తీసుకున్నా జాగ్రత్తగా ఉండాలని పదేపదే ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. సామాజిక దూరం పాటించాలని, మాస్కులు పెట్టుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నా , జరిమానాలు విధిస్తామని చెబుతున్నా ప్రజలు మాత్రం కరోనా నిబంధనలను గాలికి వదిలేశారు. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా మాస్కులు లేకుండానే బయట తిరుగుతున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

కరోనాను మరచిపోతున్న జనాలు .. బయట ఎక్కడ చూసినా మాస్కులు లేకుండా జనాలు
కరోనా మహమ్మారి ముగియలేదని, కొత్త వైవిధ్యాలతో ప్రజల పైన పదే పదే దాడి చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ప్రజలు, ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. కానీ భారత దేశంలో ప్రజల పరిస్థితి కరోనా మహమ్మారిని మరిచిపోయినట్టు గా కనిపిస్తుంది. ఏ రాష్ట్రంలో చూసినా మాస్కులు లేకుండా తిరుగుతున్న వారే అధికంగా కనిపిస్తున్నారు. ఇక గుంపులు గుంపులుగా వివాహాలు, వేడుకలు జరుపుకుంటున్న వారు, సమావేశాలకు హాజరవుతున్నవారు, గుంపులుగా కూర్చుని మాస్కులు లేకుండా మాట్లాడుకుంటున్న వారు కనిపిస్తున్నారు.

వ్యాక్సిన్లు తీసుకున్నామన్న ధీమా... ఆ ధీమానే కొంప ముంచుతున్న పరిస్థితి
ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి తో మరణాల సంఖ్య తక్కువ కావడంతో, వ్యాక్సిన్లు తీసుకున్నామన్న ధీమాలో ప్రజలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆ ధీమానే ప్రమాదం అంటున్నారు నిపుణులు. కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నా కరోనా రాదని కాదని చెప్తున్నారు. తాజాగా యువకులు కూడా కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన అనేక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా యువత కరోనా వ్యాప్తికి కారణం అవుతున్న నేపధ్యంలో వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బాగా పెరిగిపోతున్న కరోనా కేసులు .. తెలంగాణా రాష్ట్రంలోనూ కరోనా పంజా
ఇటీవల ఎక్కడ చూసినా ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలోనే కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గణనీయంగా కేసులు తగ్గాయని ఊపిరిపీల్చుకున్న తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ పెరుగుతున్న కేసులు తలనొప్పిగా తయారయ్యాయి. తాజాగా ఒక్కరోజులోనే 836 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతుంది. అయినప్పటికీ ఎక్కడా కూడా రాష్ట్రంలో కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపించడం లేదు.

అలెర్ట్ గా లేకుంటే ఫోర్త్ వేవ్ ముప్పు ... ప్రభుత్వాలు కఠినంగా ఉండాల్సిందే
ప్రజలు అప్రమత్తంగా లేకుంటే కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. కరోనా లక్షణాలు కనిపించినా పరీక్షలు చేయించుకోకపోవడం, కరోనాతో బాధపడుతున్నప్పటికీ బయట తిరగడం, మాస్కులు పెట్టుకోకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరించడం వెరసి మళ్లీ దేశం కరోనా మహమ్మారి గుప్పిట్లో చిక్కుకుంటుంది. ప్రభుత్వాలు మాస్కులు పెట్టుకోని వారికి జరిమానా విధిస్తామని చెప్పినా, పెద్దగా జరిమానాలు విధిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రభుత్వ చర్యలు కూడా నామమాత్రంగా ఉండటంతో ప్రజలకు కరోనా అంటే భయం లేకుండా పోయింది. ఫలితంగా మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితి ఆందోళనకు కారణంగా మారుతుంది.












Click it and Unblock the Notifications