గోబ్యాక్! ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారు?: టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలకు షాక్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్నవారు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం జోరును పెంచారు. అయితే, కొందరు నేతలకు మాత్రం ప్రజల నుంచి చేదు అనుభవాలు తప్పడం లేదు.
ఆంధ్రా యువకుడి అభిమానానికి ఫిదా! కేటీఆర్ ధన్యవాదాలు, అసలేం చేశారంటే.?
ఏం చేశారని..
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా వర్ధన్నపేట ఎనుమాముల బాలాజీనగర్ కూడలిలో 12 డివిజన్ టీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఎమ్మెల్యేగా నాలుగున్నరేళ్లలో మా ఊరుకు ఏంచేశారంటూ స్థానికులు ఆయనను నిలదీశారు.
గో బ్యాక్ అంటూ.. నిరసనతో వెనుదిరిగిన తాజా మాజీ ఎమ్మెల్యే
అంతేగాక, ‘గో బ్యాక్.. గోబ్యాక్' అంటూ నినాదాలు చేశారు. మీకు ఓటు అడిగే హక్కు లేదు అంటూ బ్యానర్లతో నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నామంటూ నిరసన తెలిపిన యువకులతోపాటు మహిళలు మద్దతు పలికారు. ఈ గందరగోళం మధ్య కొంతసేపు వేదికపై ఉన్న రమేష్.. ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
నిలదీసిన గ్రామస్తులు
ఇది ఇలా ఉంటే, టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మనోహర్రెడ్డి జూలపల్లి మండలంలోని వెంకట్రావుపల్లి, కాచాపూర్ గ్రామాల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం చేశారు. ఆ సమయంలో ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని గ్రామస్థులు ఆయన్ను నిలదీశారు.
అభివృద్ధి ఎక్కడ?
వెంకట్రావుపల్లిలో గ్రామ అభివృద్ధి నివేదన పేరిట ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ముద్రించిన పనులు ఎక్కడ చేశారని అడిగారు. పనులు చేయకున్నా ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారని ప్రశ్నించారు గ్రామస్తులు. పనులు చేసినందునే అందరికీ తెలిసేలా ప్రదర్శనకు ఉంచినట్లు మనోహర్రెడ్డి సమాధానమిచ్చారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలస్తొయన్నారు.. ఎవరికిచ్చారు? అని నిలదీశారు.