భారీగా పెరిగిన తెలంగాణ తలసరి ఆదాయం: 11 నుంచి 3వ స్థానానికి ఎగబాకిందన్న సీఎస్ సోమేశ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగిందన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపుగా ఉందని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ప్రజల తలసరి ఆదాయం రూ. 1.24 లక్షలుగా ఉందని, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2021-22 నాటికి అది రూ. 2.78 లక్షలకు పెరిగిందని తెలిపారు.
రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ డిఫెన్స్ కాలేజీ బృందం తెలంగాణ సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైంది. జాతీయ భద్రత, వ్యూహాత్మక అంశాల్లో చేస్తున్న అధ్యయనంలో భాగంగా సచివాలయం, బీఆర్కే భవన్ను బృందం సందర్శించింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి పథకాల గురించి సీఎస్ ఆ బృందానికి వివరించారు.

2014-15లో జీఎస్డీపీ రూ. 4.16 లక్షల కోట్లు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 130 శఆతం పెరిగిందని తెలిపారు. తలసరి ఆదాయంలో దేశంలో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ, ఇప్పుడు మూడో స్థానానికి చేరుకుందన్నారు. సొంత వనరులతోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. వ్యవసాయం, నీటి పారుదల, పరిశ్రమలు, ఇతర వినూత్న కార్యక్రమాల్లో ప్రభుత్వం.. పెట్టుబడి వ్యయం పెంచడంతో రాష్ట్ర ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు కాకతీయ రాజుల హయాంలో నిర్మించిన 45వేల చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరణ, అభివృద్ధి చేయడంతో సాగు విస్తీర్ణం 1.22 కోట్ల ఎకరాల నుంచి 2.03 కోట్ల ఎకరాలకు పెరిగిందని సీఎస్ సోమేశ్ కుమార్ డిఫెన్స్ కాలేజీ బృందానికి వివరించారు. అంతేగాక, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. టీఎస్ బీపాస్, ఐటీ, పారిశ్రామిక విధానాలు, ధరణి, గ్రామీణాభివృద్ధి వంటి కార్యక్రమాలపై సంబంధిత అధికారులు సదరు బృందానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.












Click it and Unblock the Notifications