మారుమూల మహబూబ్ నగర్ జిల్లా నుంచి సోషల్ మీడియా సెలెబ్రిటీ దాకా: మోడీతో గెడ్డంతో కంపేర్
మహబూబ్ నగర్: ఈ ఫొటోలో కనిపిస్తోన్న పెద్దాయన పేరు మేకల కూర్మయ్య. వయస్సు 70 సంవత్సరాలు పైమాటే. మహబూబ్ నగర్ జిల్లా చిన్నమునగాల ఛద్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి. ఒకే ఒక్క పనితో ఆయన సోషల్ మీడియాను షేక్ చేసి పారేస్తున్నారు. జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించారు. మూడు, నాలుగు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. పక్షి గూడును మాస్క్గా ధరించిన మేకల కూర్మయ్య ఫొటో.. నెట్టింట్లో వైరల్గా మారింది. తాను జాతీయ స్థాయిలో ఫేమస్ అవుతానని ఏమాత్రం ఊహించి ఉండరాయన.
ఈ ఫొటో- తెలంగాణ ప్రభుత్వం అందజేస్తోన్న పింఛన్ మొత్తాన్ని తీసుకోవడానికి మండల రెవెన్యూ కార్యాలయానికి వచ్చినప్పుడు తీసినది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి మాస్క్ ధరించడంపై కూర్మయ్యకు పెద్దగా అవగాహన లేదు. మాస్క్ లేకుండానే ఆయన గొర్రెలను మేపుకోవడానికి వెళ్లారు. మండల రెవెన్యూ కార్యాలయంలో పింఛన్ ఇస్తున్నట్లు తెలియడంతో ఆయన అటు నుంచి అటే అక్కడికి వెళ్లారు.

మాస్క్ లేకపోవడం వల్ల పింఛన్ ఇవ్వరనో లేక.. జరిమానా విధిస్తారోనని భావించిన కూర్మయ్య మేకలు మేపడానికి వెళ్లిన సమయంలో కంటికి కనిపించిన పక్షి గూడును ముఖానికి ఇలా తగిలించుకున్నారు. పక్షిగూడు మాస్క్తోనే మండల కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో అక్కడున్న కొందరు ఆయన ఫొటోను తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే.. చురచురమంటూ అంటుకుందా పిక్. వైరల్గా మారింది. లోకల్ నుంచి నేషనల్ మీడియా వరకూ పాకిందీ విషయం.
కూర్మయ్య ఫొటోతో దాదాపు అన్ని జాతీయ దినపత్రికలు, వెబ్సైట్లు ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. నెటిజన్లు మరో అడుగు ముందుకేసి- ఆయనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గెడ్డంతో పోల్చడం మొదలు పెట్టారు. ఓ మారుమూల గ్రామీణుడికి మాస్క్ను ధరించి తీరాలనే ఆలోచన.. చాలామందికి కనువిప్పు కలిగించేదిగా అభివర్ణిస్తున్నారు. మాస్క్ను ధరించని వారు ఆయనను, ఆయన క్రమశిక్షణను చూసి నేర్చుకోవాలంటూ హితబోధ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications