తెలంగాణ కోసం గుజరాత్లో కేటీఆర్ ఇలా..(పిక్చర్స్)
అహ్మదాబాద్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును నిర్ధేశిత గడువులోగా పూర్తి చేస్తామని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం అన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును మిషన్ మోడ్లో ముందుకు తీసుకు వెళ్తామన్నారు.
గుజరాత్లో అమలవుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును సందర్శించాక, అక్కడి పరిజ్ఞానాన్ని, ప్రణాళికలను అధ్యయనం చేశాక తెలంగాణలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయగలమన్న నమ్మకం కలిగిందన్నారు. తమ రెండు రోజుల గుజరాత్ పర్యటన విజయవంతమైందన్నారు.
రెండు రోజుల పాటు గుజరాత్ పర్యటనలో ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజినీర్లతో పలు దఫాలుగా వివిధ అంశాల పైన చర్చించిన కేటీఆర్, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు సాంకేతిక పరిజ్ఞానాన్ని, క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరును సుదీర్ఘంగా చర్చించారు. ఓ వైపు అధికారులతో చర్చలు, మరోవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలతో బిజీగా గడిపారు. గుజరాత్ వాటర్ గ్రిడ్కు తెలంగాణ వాటర్ గ్రిడ్కు కొన్ని సారూప్యతలతో పాటు స్థూలంగా చాలా తేడాలున్నాయన్నారు.
అయితే గుజరాత్లో విజయవంతమైన కొన్ని పద్ధతులను తెలంగాణ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు అన్వయించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ముఖ్యంగా గుజరాత్ వాటర్ గ్రిడ్ ద్వారా నీటిని సరఫరా చేసే పన్నీ సమితి పని తీరును కేటీఆర్ అభినందించారు. గ్రామాల్లో ఉన్న వాటర్ గ్రిడ్ వ్యవస్థ నిర్వహణ, పంపిణీ కార్యక్రమాలకు అక్కడి మహిళలే చేస్తుండటం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
గుజరాత్లో కేటీఆర్
తెలంగాణ గ్రామాల్లోను వాటర్ గ్రిడ్ నిర్వహణలో స్వయం సహాయక బృందాలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మొత్తం గుజరాత్లోని తాగునీటి అవసరాల్లో 60 శాతం నదుల నుండి, 40 శాతం ఇతర జలవనరుల నుడి తీసుకుంటున్న తీరుతో తెలంగాణ ప్రాంతానికి పోలిక ఉందన్నారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనల ద్వారా వాటర్ గ్రిడ్ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడం పైన అవగాహన వచ్చిందన్నారు.
గుజరాత్లో కేటీఆర్
వివిధ అంశాల పైన అక్కడి అధికారులు తెలిపిన వివరాలతో, మొత్తం వాటర్ గ్రిడ్ వ్యవస్థను అధ్యయనం చేసి, ఇది తెలంగాణకు ఏవిధంగా దోహదపడుతుందో తెలిపేలా సమగ్ర నివేదికను రూపొందించాలని కేటీఆర్ ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. రెండో రోజు పర్యటనలో నోవడా పంపింగ్ కేంద్రాన్ని కేటీఆర్ సందర్శించారు. 12 మోటార్లతో 8 టీఎంసీల నీటిని 2325 గ్రామాలకు, 38 పట్టణాలకు సరఫరా చేస్తున్న తీరును పరిశీలించారు.
గుజరాత్లో కేటీఆర్
నోవడా పంపింగ్ కేంద్రం నుండి నీరు సరఫరా అవుతున్న అమీదన గ్రామంలో ఇంటింటికీ నీరు అందుతున్న విధానాన్ని స్థానిక కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కలను తాము త్వరలోనే సాకారం చేస్తామని కేటీఆర్ తెలిపారు.
గుజరాత్లో కేటీఆర్
రెండ్రోజుల పాటు తమతో పాటు ఉండి సహకరించిన గుజరాత్ ప్రభుత్వ అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్ అధికారులు మాట్లాడుతూ.. తెలంగాణ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణంలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు తాము సహకరిస్తామన్నారు. పర్యటనలో కేటీఆర్తో పాటు ఆర్డబ్ల్యుఎస్ ఈఎస్సీ సురేందర్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఉన్నతాధికారులు ఉన్నారు.