రూ. 5 భోజనం రుచి చూసి మెచ్చుకున్న జానా: కాంగ్రెస్కు ఝలక్ (పిక్చర్స్)
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేడి రాజుకున్న వేళ కాంగ్రెసు సీనియర్ నేత కె. జానా రెడ్డికి విచిత్రమైన కోరిక కలిగింది. హైదరాబాదులో పేదల కోసం జిహెచ్ఎంసి రూ.5కు అందిస్తున్న భోజనం చేయాలనే కోరిక. ఆ భోజనాన్ని తెప్పించుకుని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి తినడమే కాకుండా దాన్ని రుచిగా ఉందంటూ మెచ్చుకున్నారు కూడా.
ఓ వైపు తన కాంగ్రెసు సహచరులు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజకీయ సమరం సాగిస్తున్న సమయంలో జానా రెడ్డి ఆ పనిచేయడం నిజంగానే వారికి షాక్ ఇచ్చినట్లయింది. గురువారం ప్రాజెక్టుల రీ డిజైనింగ్ను సమర్థిస్తూ సూచనల పేరిట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జానా రెడ్డి ఆ ఝలక్ ఇచ్చారు.
జిహెచ్ఎంసి రూ.5కు అందిస్తున్న భోజనాన్ని సీఎల్పీ సిబ్బందితో వెంటనే తెప్పించుకొని తిన్నారు. మీడియా ప్రతినిధులకు కూడా తినిపించారు. ధరతో పోల్చుకుంటే అన్నం, కూర, సాంబారు ఇవ్వడం సబబుగానే ఉందన్నారు. కాగా ఈ భోజనంపై ప్రతి ఐదు రూపాయలపై జీహెచ్ఎంసీ రూ.20 సబ్సిడీ భరిస్తుందని తెలుసుకున్న ఆయన రూ.25కు ఎలాంటి భోజనం పెట్టవచ్చో లెక్కలు కూడా వేసి చూపించారు.

ఓ కోరిక ఎందుకు కలిగినట్లో...
సబ్సిడీ భోజనం చేయాలన్న కోరిక ఎందుకు కలిగిందన్న ప్రశ్నకు మాత్రం జానారెడ్డి నేరుగా సమాధానం చెప్పలేదు. అతితక్కువ ధరకు లభిస్తున్న భోజనం ఎలా ఉందో చూద్దామనుకున్నానని మాత్రం చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈ పథకాన్ని బాగా ప్రచారం చేసుకుంటున్న తరుణంలో జానా రూ.5 భోజనం చేసి కితాబివ్వడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

విస్తరణకు ప్లాన్
ప్రస్తుతం టీఆర్ఎస్ ఐదు రూపాయలకు భోజనం పథకాన్ని 200 కేంద్రాలకు విస్తరిస్తామని చెబుతోంది. ఇటువంటి సందర్భంలో జానారెడ్డి భోజనంపై చర్చకు దిగడం కాంగ్రె్సలోనే కాకుండా ఇతర పార్టీల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. పేదలకు ఎలాంటి భోజనం పెడుతున్నారో పరిశీలించడం అవసరమే అయినా ఇది సమయం, సందర్భం కాదని కాంగ్రెసు నాయకులు గుర్రుమంటున్నారు.

సాగునీటి ప్రాజెక్టులపై కూడా..
సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ మార్చే విషయంలో కూడా జానారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం కాంగ్రెస్ నేతల్ని విస్మయానికి గురిచేస్తోంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నపుడు కాంగ్రెస్ దానిని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ స్థితిలో ప్రాజెక్టులపై ఇప్పుడు జానా రెడ్డి మాట్లాడడం అవసరమా అని కాంగ్రెసు పెద్దలు నొచ్చుకుంటున్నారు.

జానా తీరు ఇదేనా...
డిజైన్ కన్నా చిన్న చిన్న బ్యారేజీలతో ప్రాజెక్టును పునఃరూపకల్పన చేయాలని జానా రెడ్డి అనండతో కాంగ్రెసు నాయకులు భగ్గుమంటున్నారు. పాలమూరు-రంగారెడ్డిని మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ అన్నపుడు ఆ సమయంలో పూర్తి చేయడం అసాధ్యమని, ప్రజల్ని మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు సవాళ్లు విసిరారు. ఈ విషయంలో జానా ప్రాజెక్టును హడావిడిగా చేయొద్దనీ, ప్రతి సంవత్సరం నీటి లభ్యతను పరిశీలించి దశలవారీగా నిర్మించాలని చెప్పడంతో పార్టీ నేతలు అయోమయానికి గురవుతున్నారు.

పార్టీపై ఏ ప్రభావం చూపుతాయో..
జానా రెడ్డి చర్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయో, గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇది ఎలాంటి సంకేతాలు పంపుతుందోనని కాంగ్రెసు నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. పార్టీకి పెద్ద దిక్కు అయిన ఆయన ఇలా చేయడంలోని ఆంతర్యం ఏమిటో అంతుబట్టక ఆశ్చర్యపోతున్నారు.












Click it and Unblock the Notifications