మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో బిగ్ ట్విస్ట్ - కొనసాగేనా..!!
తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కొనసాగుతోంది. ఈ నిర్ణయం అమలు వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దీని పైన హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని ఓ ప్రైవేట్ ఉద్యోగి తన పిల్లో పేరొన్నారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదననేది పిటీషనర్ వాదన. దీని పైన హైకోర్టులో విచారణ జరగనుంది.
హైకోర్టులో పిల్: తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తోంది. ఈ పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ పథకం పైన కొన్ని సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ప్రభుత్వం గత నెల 8న జారీ చేసిన జీవో 47ను సస్పెండ్ చేయాలని పిటీషన్ రు న్యాయస్థానాన్ని కోరారు.
పురుషులపై వివక్ష: 1950లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రోడ్డు రవాణా చట్టం ప్రకారం ఆర్టీసీ కార్పొరేషన్ ఏర్పాటైందని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు. దీంతో పాటుగా కీలక అంశాలను ప్రస్తావించారు. మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం పురుషుల పట్ల వివక్ష చూపడమే అవుతుందని, ఇది రాజ్యాంగంలోని 15వ అధికరణానికి వ్యతిరేకమని వివరించారు.
ఉచిత ప్రయాణ వసతితో మహిళలు అవసరం లేకున్నా ప్రయాణించే పరిస్థితులు ఏర్పడ్డాయని, దీని ఫలితంగా టికెట్లు కొనుగోలు చేసి వెళ్లే పురుష ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఉచిత ప్రయాణం నిలిపివేయాలి: మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆర్థికంగా ఆర్టీసీపై పడే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం కూడా అన్యాయమేనని, పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బును మహిళల ఉచిత ప్రయాణ వసతికి వినియోగించడం చెల్లదని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిటీషనర్ తన పిల్ లో కోర్టును అభ్యర్దించారు.
తన పిల్ లో రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు ఆర్టీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం త్వరలో విచారణ చేపట్టనుంది. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి కర చర్చగా మారుతోంది.












Click it and Unblock the Notifications