ఉరేసుకున్న తొమ్మిదేళ్ల బాలిక... బహుశా అదే జరిగి ఉండొచ్చునని పోలీసుల అనుమానాలు...
హైదరాబాద్లోని ఖాజా కాలనీలో తొమ్మిదేళ్ల చిన్నారి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలంతా కలిసి ఆడుకునే సమయంలో ఆ చిన్నారి ఆత్మహత్యకు పాల్పడింది. బహుశా.. భయపెట్టడానికే ఆ చిన్నారి ఉరివేసుకుంటానని చెప్పి ఉండవచ్చునని... కానీ అనుకోకుండా అది నిజంగానే జరిగిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్కి చెందిన నేనావత్ శ్రీనిధి(9) గత మంగళవారం(మార్చి 23) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.తొమ్మిదేళ్ల చిన్నారి ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందని చాలామంది షాక్కి గురయ్యారు. కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించే ఆమె తల్లిదండ్రులు ఎప్పటిలాగే ఆరోజు కూడా పనికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేసరికి... తమ బిడ్డ చనిపోయిందని తెలిసింది. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని వారి పిల్లలు,బంధువుల పిల్లలు చెప్పారు.
సీలింగ్ ఫ్యాన్కు చెల్లెలు ఉరేసుకుందని... తానే ఆ తాడును కోసి ఆమెను కిందకు దించానని ఆ చిన్నారి సోదరి పోలీసులకు వెల్లడించింది. ఆరోజు ఘటన జరిగిన సమయంలో అక్కడున్న పిల్లలందరితోనూ పోలీసులు మాట్లాడారు. దాన్నిబట్టి ఒక అంచనాకు వచ్చారు. చనిపోయిన ఆ బాలిక తమ ఇంటి సమీపంలోని ఓ గుడికి వెళ్లాలని భావించింది. అయితే ఆమె సోదరుడు కూడా వెంట వస్తానని చెప్పడంతో... నువ్వు వస్తే నేను ఉరేసుకుని చనిపోతానని బెదిరించింది. గతంలోనూ ఆ చిన్నారి ఇలాగే పలుమార్లు బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు.
అలా తన తమ్ముడిని భయపెట్టేందుకు ఉరేసుకుంటానని బెదిరించిన చిన్నారి... ఆ క్రమంలో ఉరితాడు మెడకు వేసుకుందని పోలీసులు నిర్దారించారు. అనుకోకుండా ఉరి మెడకు బిగుసుకుపోవడంతో ఆమె చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ వచ్చాక అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.