ప్రధాని మోదీ - షా ఆపరేషన్ తెలంగాణ : మరో కేంద్ర మంత్రి పదవి - కాంగ్రెస్ నేతలకు ట్రాప్..!!
తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఇటు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతోంది. అటు బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో తెలంగాణలో పార్టీ విస్తరణ.. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం ఫోకస్ చేసింది. ప్రధాని మోదీ- హోం మంత్రి అమిత్ షా ఆపరేషన్ తెలంగాణ మొదలు పెట్టారు. ఆపరేషన్ ఆకర్ష్ కు పార్టీ తెర తీస్తోంది. కాంగ్రెస్ అసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. తెలంగాణ బీజేపీ నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయంగా దూకుడు గా వెళ్లాలని నిర్ణయించారు.
ప్రధాని మోదీ- షా తెలంగాణ పై ఫోకస్
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. అందులో భాగంగా పార్టీ బలోపేతం..ఇతర పార్టీల నుంచి చేరికలకు నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గాల వారీగా సమాచారం సేకరించింది. కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తోంది. కొందరు కాంగ్రెస్ సీనియర్లను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రణాళికను వేగవంతం చేస్తోంది. అందులో భాగంగా తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గానే కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి రావాలంటూ ఆహ్వానించారు. కేసీఆర్ లక్ష్యంగా పొలిటికల్ టీంను బలోపేతం చేయాలని డిసైడ్ అయ్యారు. ఈటల రాజేందర్ - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇతర పార్టీల నేతలను ఆకర్షించే బాధ్యతలను అప్పగించారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా.. నియోజకవర్గ స్థాయిలోనూ ఇతర పార్టీల నుంచి వచ్చే వారని గుర్తించాలని టాస్క్ డిసైడ్ చేసారరు. వచ్చే రోజుల్లో బీజేపీలో చేరికలు పెద్ద సంఖ్యలో ఉంటాయని చెబుతున్నారు.
తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి
ఇప్పటి వరకు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర కేబినెట్ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. జనవరిలోనే విస్తరణకు ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ బీజేపీ నుంచి మరో బీసీ నేతకు కేంద్ర కేబినెట్ లో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బీసీ నేతకే పదవి ఇవ్వాలనేది ప్రధాని మోదీ - షా ఆలోచనగా ముఖ్య నేతలు చెబుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా.. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడుగా ఉన్న లక్ష్మణ్ పేరు ప్రచారంలో ఉంది. బండి సంజయ్ పేరు తెర మీదకు వచ్చినా.. పార్టీ విస్తరణ - ఎన్నికల సంసిద్దతలో భాగంగా బండి సంజయ్ కు పార్టీ వ్యవహారాల్లోనే కొనసాగిస్తారనేది మరో వాదన. పార్టీలో ఇప్పుడు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మరో బీసీ నేత పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇదే సమయంలో ఒక ఎంపీ పేరు ఢిల్లీ సర్కిల్స్ లో ప్రచారంలో ఉంది. బండి సంజయ్ పాదయాత్ర రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా బలమైన వాతావరణం ఉందని.. తోడుగా ఇతర నాయకులను కూడా రంగంలోకి దించి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని సునీల్ బన్సల్, భూపేంద్ర యాదవ్ పార్టీ నాయకత్వానికి నివేదించారు. రాష్ట్రంలో ప్రధాన బీసీ వర్గాలతోపాటు రెడ్డి సామాజికవర్గాన్ని కూడా బీజేసీ విశ్వాసంలోకి తీసుకోవాలని సూచించారు. రెడ్డి వర్గం నుంచి మంత్రిగా ఉండటంతో..బీసీ వర్గానికి ఈ సారి అవకాశం దక్కనుంది.
నిరంతం ప్రధాని ఆరా - బండి వీడియో ప్రదర్శన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూర్తి దృష్టి తెలంగాణపైనే కేంద్రీకరించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 2023లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ ఇప్పుడు బీజేపీకి కీలకంగా మారుతోంది. ఎన్నికలు జరిగే కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ లో పార్టీ బలంగా ఉందని చెబుతున్నారు. తెలంగాణలో తొలి సారి హోరా హోరీ పోరుకు బీజేపీ సిద్దమైంది. ఇప్పటికే సర్వే సంస్థల తో నియోజకవర్గాల వారీగా పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. సంక్రాంతి తరువాత తెలంగాణ విషయంలో కీలక నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. ఇదే సమయంలో బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర పేరిట నిర్వహిస్తున్న పాదయాత్ర వీడియోను ఢిల్లీలో పార్టీ ఎంపీల సమావేశంలో ప్రదర్శించనున్నారు. సంజయ్ నిర్వహిస్తున్న పాద యాత్రకు నరేంద్రమోదీ కితాబిచ్చారు. ఇప్పటివరకు జరిగిన ఐదు విడతల పాదయాత్రకు సంబంధించిన 15 నిమిషాల నిడివితో ఉన్న ఓ వీడియోను సిద్ధం చేశారు. ఒక ప్రముఖ కాంగ్రెస్ నేతను బీజేపీలోకి తీసుకొచ్చేందకు రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. తెలంగాణ బీజేపీలో త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.