తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ ఫోన్
SLBC Tunnel: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం రాత్రి ఫోన్ చేశారు. ఈ ఉదయం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై ప్రధాని మోడీ ఆరా తీశారు. ఘటనపై పూర్తి వివరాలను ప్రధానికి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు ప్రారంభించినట్లు ప్రధానికి తెలిపారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపిస్తామని సీఎంకు ప్రధాని మోడీ చెప్పారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర హామీ ఇచ్చారు. కాగా, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనా స్థలానికి శనివారం రాత్రి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
ఎస్ఎల్బీసీకి మంత్రులు, రంగంలోకి రెస్క్యూ బృందాలు
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఎస్ఎల్బీసీ ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. దీంతో పలువురు ఇంజినీర్లు అందులోనే చిక్కుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారిని కాపాడేందుకు అన్ని చర్యలు చేపడుతోంది.
ఎస్ఎల్బీసీ ప్రమాదస్థలిని పరిశీలించిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. శనివారం ఉదయం 8 గంటలకు కార్మికులు టన్నెల్ లోపలికి వెళ్లారని.. ఆ తర్వాత అరగంటకు బోరింగ్ మిషన్ ఆన్ చేశారని చెప్పారు. ఈ క్రమంలో టన్నెల్లో ఒకవైపు నుంచి నీరు లీకై మట్టి కుంగి పెద్ద శబ్ధం వచ్చిందని తెలిపారు. టీబీఎం ఆపరేటర్ ప్రమాదాన్ని ముందు పసిగట్టారని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన 42 మంది కార్మికులు బయటకు తీసుకొచ్చారు.
అయితే, బోరింగ్ మిషన్ ముందున్న 8 మంది చిక్కుకుపోయారని, వారిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారి ప్రాణాలు రక్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు. ఉత్తరాఖండ్లో ఇలాంటి ఘటన జరిగితే టన్నెల్లో వారిని రెస్క్యూ చేసిన నిపుణులతో మాట్లాడామని మంత్రి తెలిపారు.
టన్నెల్ లో చిక్కుకుపోయినవారు ఉత్తరాఖండ్, జార్ఖండ్ వాసులున్నారని చెప్పారు. వారిలో ఒక ప్రాజెక్ట్ ఇంజినీర్, ఫీల్డ్ ఇంజినీర్, నలుగురు కార్మికులు, జమ్మూకాశ్మీర్, పంజాబ్కు చెందిన ఇద్దరు బోరింగ్ మిషన్ ఆపరేటర్లు ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 14 కిలోమీటర్ల లోపల ఇరుక్కుపోవడంతో వారిని బయటకు తీసుకురావడం కష్టసాధ్యంగా మారిందన్నారు. రెస్క్యూ టీంలు శనివారం రాత్రి ప్రమాద ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడతామని మంత్రి వివరించారు.












Click it and Unblock the Notifications