రోశయ్య మరణంపై ప్రధాని సంతాపం :కేసీఆర్ నివాళి : అజాతశత్రువు - చంద్రబాబు.. !
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు . ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు. ''రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం. తమిళనాడు గవర్నర్గా పనిచేసినప్పుడు ఆయనతో అనుబంధం ఉంది. రోశయ్య సేవలు మరువలేనివి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి'' అని మోదీ తెలిపారు. కాగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.
రోశయ్య పార్దివ దేహానికి కేసీఆర్ నివాళి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమీర్ పేటలోని రోశయ్య నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు రోశయ్య అంత్యక్రియలు నగర శివార్లలో ఉన్న కొంపల్లి ఫాం హౌస్ లో నిర్వహించాలని భావిస్తున్నామని చెప్పారు. దీంతో.. కుటుంబ సభ్యులు కోరిన ప్రాంతంలోనే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రోశయ్య కు నివాళి అర్పించారు. ఆయనతో సుదీర్ఘ కాలంగా సంబంధాలు ఉన్నాయన్నారు.
రోశయ్య అజాతశత్రువన్న చంద్రబాబు
రోశయ్య తాను రాజకీయంగా పలు సందర్భాల్లో విభేదించుకున్నా..వ్యక్తిగతంగా మాత్రం ఆప్యాయంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. హుందాతనంతో కూడిన భాషతో ఆయన రాజకీయ విమర్శలు చేసేవారన్నారు. ఆయనకు దేవుడు మంచి వాయిస్ ఇచ్చారని.. ఒక్కోసారి తాము కూడా ఆయన గురించి మాట్లాడుకొనే వాళ్లమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏ పదవిలో ఉన్న రోశయ్య రాణించారని..ఆయన అజాత శత్రువు అంటూ కొనియాడారు. రోశయ్య కాంగ్రెస్ పార్టీకి ఒక ఆస్తిగా అభివర్ణించారు. రోశయ్య వ్యక్తి కాదు..వ్యవస్థ అని.. ఆయన జీవిత చరిత్ర ఒక రాజకీయ పాఠమని చంద్రబాబు నివాళి అర్పించారు.
తెలంగాణ మంత్రులు సైతం
తెలంగాణ మంత్రులు హరీష రావు రోశయ్య నివాసానికి వెళ్లి రోశయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయనకు మిత్రులు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలిని చాటుకున్న రోశయ్య మృతిచెందడం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆంకాంక్షించారు. దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర శాసన సభలో 15 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఆయన చేయని పదవిలేదు, గౌరవం లేదన్నారు. ఆయన పనిచేసిన అందరు సీఎంలో మన్ననలు పొందారని చెప్పారు.