దారుణం: కత్తితో పోడుభూముల సాగుదారుల దాడి, అటవీశాఖ అధికారి మృతి
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో పోడు భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు పోడు సాగుదారుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ అటవీశాఖ అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడు సమీపంలో అటవీశాఖ అధికారులు నాటిన మొక్కలను తొలగించేందుకు వెళ్లిన సాగుదారులను అధికారులు అడ్డుకున్నారు. అంతేగాక, పోడుభూముల సాగుదారులు మూకుమ్మడిగా వారిపై దాడి చేశారు.

దీంతో బెండాలపాడు అటవీశాఖ సెక్షన్ అధికారి రామారావు అక్కడ్నుంచి పారిపోయారు. అక్కడేవున్న అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావుపై పోడుసాగుదారులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. మెడభాగంలో కత్తితో దాడి చేయడంతో తీవ్రరక్తస్రావమైంది.
వెంటనే శ్రీనివాసరావును చంద్రుగొండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ్నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యలోనే శ్రీనివాసరావు మృతి చెందారు. దాడికి పాల్పడినవారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications