కెమికల్ కంపెనీలో విషవాయువులు లీక్, ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
నగరంలోని బాలానగర్ ఇండస్ట్రీ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక ప్రాంతంలోని బయోకెమికల్స్ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు విషవాయువులు పీల్చడం వల్ల మృతి చెందారు.
హైదరాబాద్: నగరంలోని బాలానగర్ ఇండస్ట్రీ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక ప్రాంతంలోని బయోకెమికల్స్ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు విషవాయువులు పీల్చడం వల్ల మృతి చెందారు.
కంపెనీలోని డ్రైనేజీని శుభ్రం చేసేందుకు ముగ్గురు కార్మికులు అందులోకి దిగిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైనేజి శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా విష వాయువులు వెలువడ్డాయి.
దీంతో ఊపిరాడక ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బయో కెమికల్స్ కంపెనీకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతులను మూసాపేట్ జనతానగర్కు చెందిన అల్లాడి రామారావు(50), అల్లాడి సీతారామ్(30)గా గుర్తించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.