దూకుడు: పట్టుబడ్డ సుజన కొడుకు, దానం అల్లుడు?
హైదరాబాద్: మితిమీరిన వేగంతో కార్లలో వెళ్తున్న దూకుడురాయుళ్లను బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. స్పీడ్ లేజర్ గన్తో కార్ల వేగాన్ని గుర్తించారు. గంటకు వంద కిలోమీటర్ల నుండి 140 కిలోమీటర్ల వేగంతో కార్లను నడుపుతున్న 287 మంది పైన కేసు నమోదు చేశారు.
వీటితో పాటు పెండింగులో ఉన్న చలానాలు ఉన్న వారిని గుర్తించి మొత్తం 502 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాదా, దూకుడురాయుళ్లలో పట్టుబడిన వారిలో కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి తనయుడు, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దానం నాగెందర్ అల్లుడు ఉన్నట్లుగా తెలుస్తోంది.
క్వారీలో పేలుడు: ముగ్గురి మృతి
కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ్రానైట్ క్వారీలో డిటోనేటర్లు పేలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ శివారులోని చింతలగుట్టపై శనివారం జరిగింది.
గ్రానైట్ తవ్వకాలు జరుగుతుండగా.. క్వారీలో పని చేస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అజయ్ (22), రాహుల్ (21), తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరియప్పన్ (47)లు పని చేస్తున్న సమయంలో డిటోనేటర్లు పేలి అక్కడికక్కడే మృతి చెందారు. ఒరిస్సాకు చెందిన మరో కార్మికుడు బీకార్నాయక్కు తీవ్ర గాయాలయ్యాయి.
విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి
వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామశివారు రాముతండాకు చెందిన మహిళా రైతు లూనావత్ లక్ష్మి (35) విద్యుదాఘాతంతో శనివారం మృతి చెందింది. రాముతండాశివారులోని వ్యవసాయ బావి వద్ద లక్ష్మి రబీలో వేసుకున్న వరిపొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి బోరుస్టార్టర్ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందింది.