నయీమ్ అనుచరుల వేట : మరో ఇంటిని రౌండప్ చేసిన పోలీసులు!
ఉప్పాల గూడ : గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నయీమ్ కదలికలపై ముందు నుంచే నిఘా పెట్టిన గ్రేహౌండ్స్ పోలీసులు.. పక్కా స్కెచ్ తో అతన్ని ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతని అనుచరుల కోసం పోలీసుల వేట కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.
నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత.. రంగారెడ్డి జిల్లా ఉప్పాల గూడ పరిధిలోని అల్కాపురి టౌన్ షిప్ లో ఉన్న ఓ ఇంటిని పోలీసులు రౌండప్ చేసినట్లు సమాచారం. పోలీసులు రౌండప్ చేసిన ఆ ఇంట్లో.. నయీమ్ బంధువులు గానీ అతని అనుచరులు గానీ తలదాచుకుని ఉండవచ్చునన్న అనుమానం వ్యక్తమవుతోంది. శంషాబాద్ డీసీపీ సన్ ప్రీతి సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ తనిఖీలు చేస్తున్నారు.
అల్కాపురీతో పాటు నార్సింగిలోని ఓ ఇంటిని కూడా పోలీసులు చుట్టుముట్టినట్లు సమాచారం. నయీమ్ కు సంబంధించిన ముఖ్య అనుచరులు ఈ ఇంట్లో తలదాచుకుని ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నయీమ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో.. అతని అనుచరులు బయటకు వచ్చే అవకాశం ఉండడంతో.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు.