వారసత్వంపై మామల షాక్, అల్లుళ్ల మౌనం!: వ్యూహాత్మకమేనా?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల అనంతరం టిఆర్ఎస్ పార్టీ వారసత్వంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగింది. గ్రేటర్లో గెలిపించిన మంత్రి కెటిఆర్ తన తండ్రి కెసిఆర్ వారసుడు అని, అయితే కెసిఆర్ మరో ఇరవై ఏళ్లు పాలిస్తారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.
పదేళ్లయినా, ఇరవై ఏళ్లయినా కెసిఆర్ రాజకీయ వారసుడు కెటిఆర్ అని దాదాపు తేలిపోయిందని చెప్పవచ్చు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగేళ్లుగా టిఆర్ఎస్, టిడిపిల పైన వారసత్వ రాజకీయాల అంశంపై చర్చ సాగింది, సాగుతోంది.
మూడు నాలుగేళ్ల క్రితం టిడిపి వారసత్వం పైన జోరుగా చర్చ సాగింది. నాడు నారా లోకేష్, హీరో జూనియర్ ఎన్టీఆర్ల మధ్య వారసత్వ పోరు నడిచింది. వారసత్వం విషయంలో నందమూరి హరికృష్ణ అప్పుడు ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు.
ఓ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ విజయవాడకు వెళ్లడం, అక్కడ భారీగా అభిమానులు రావడం.. తన బలం ప్రదర్శించేందుకేననే వాదనలు వినిపించాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడవద్దని బాలకృష్ణ అభిమానుల నుంచి సందేశాలు వెళ్లినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
అప్పుడు టిడిపిలో వారసత్వ పోరు తారాస్థాయికి చేరుకుంది. అయితే ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ లేదా చంద్రబాబు బయటపడలేదు. హరికృష్ణ మాత్రం వారసత్వం పోరు విషయంలో తన ఆవేశాన్ని బయటకు వెళ్లగక్కారు.
ఆ తర్వాత వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ను తెరపైకి తీసుకు వచ్చింది. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేష్ అని తేలిపోయింది. టిడిపి వారసుడు తేలిపోయిన నేపథ్యంలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మౌనంగానే ఉన్నారనవచ్చు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక.. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కెసిఆర్ వారసుడి పైన కూడా చాలా రోజులుగా చర్చ సాగుతోంది. వారసుడి రేసులో ప్రధానంగా కెటిఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత, ఈటెల రాజేందర్ తదితరుల పేర్లు వినిపించాయి.
గ్రేటర్ ఎన్నికల తర్వాత ఆ వారసుడు కెటిఆర్ అని దాదాపు తేలిపోయింది. నాడు చంద్రబాబు వారసుడిగా లోకేష్ తేలినప్పుడు జూ ఎన్టీఆర్ ఎలాగైతే మౌనంగా ఉన్నారో, ఇప్పుడు కెసిఆర్ వారసుడు కెటిఆర్ అని తేలాక హరీష్ రావు కూడా అదే మౌనం పాటిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే, ఇక్కడ ఒకటే తేడా ఉందని అంటున్నారు. టిడిపి తరఫున ఎన్టీఆర్ 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ పూర్తి రాజకీయ వ్యూహాలు ఆయనకు తెలియవు. అయితే, 2019లో జూ ఎన్టీఆర్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. టిఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి.. హరీష్ రావుకు చాలా రాజకీయ అనుభవం ఉంది. అతనిది వ్యూహాత్మక మౌనమా అనే చర్చ సాగుతోంది.