వరద బాధితుల పరిహారం పేర్ల నమోదులో తన్నుకున్న టీఆర్ఎస్ నేతలు.. వీళ్ళు మారరు!!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సొంత పార్టీ నేతల పైన బహిరంగ వేదికలపై బాహాటంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు, అనేక సందర్భాల్లో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోతుంది.
మాజీ ఎంపీ పొంగులేటి , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వర్గాల మధ్య ఘర్షణ
తాజాగా మరోమారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం అంబేద్కర్ విగ్రహావిష్కరణ తో పాటు మరికొన్ని ఘటనలలో పొంగులేటి రేగా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అనేక సందర్భాల్లో రెండు వర్గాలు బాహాబాహీకి దిగారు. ఇక రేగా కాంతారావు బాహాటంగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుళ్లూరు బ్రహ్మయ్య లను ఉద్దేశించి అనేకమార్లు హెచ్చరికలు జారీ చేశారు.
వరద బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం పేర్ల నమోదులో ఘర్షణ
తనకు కత్తి తిప్పటం వచ్చు అని పేర్కొన్న రేగ కాంతారావు స్వతహాగానే తను ఫైటర్ అని, పదేళ్ల వయసులోనే కత్తులతో ఆడుకున్నా అని, తనకు తుపాకీ పేల్చడం కూడా వచ్చు అని వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, పోటాపోటీగా నియోజకవర్గంలో తిరగడం ఇక్కడ టిఆర్ఎస్ పార్టీలో నాయకులకు పరిపాటిగా మారింది. ఇక తాజాగా అశ్వాపురం మండలం ఆనందపురం గ్రామంలో వరద బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం పేర్ల నమోదులో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది.
ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పొంగులేటి, రేగా వర్గీయులు
వరద పరిహారం విషయంలో చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి కనిపించింది. అటు రేగా కాంతారావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రభుత్వం అందించే సహాయం విషయంలో రెండు వర్గాలు అనర్హుల, అర్హతలేనివారి పేర్లు, తమకు అనుకూలంగా ఉన్న వారి పేర్లు నమోదు చేస్తున్నారని మొదలైన వివాదం ఇరువర్గాల తోపులాటకు కారణమైంది.
వరద సహాయం అందించాల్సిన నేతలే కొట్టుకుంటున్నతీరుతో స్థానికుల్లో అసహనం
ఒకపక్క భద్రాచలం పినపాక నియోజకవర్గంలో నిత్యవసర వస్తువులను పదివేల మందికి సహాయం చేసే పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంటే, మరోపక్క సహాయం చేయాల్సిన అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు అది పక్కన పెట్టి బాహాబాహీకి దిగటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇరు వర్గాల మధ్య ఘర్షణ నేపధ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఇరువర్గాలను అక్కడినుండి పంపించేశారు. అంతేకాదు పినపాక నియోజకవర్గంలో రేగా కాంతారావు మీద పోటీ చేసి ఓటమి పాలైన టీఆర్ఎస్ నేత పాయం వెంకటేశ్వర్లుతో కూడా రేగా కాంతారావు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. దీంతో స్థానికంగా నేతల తీరు పోలీసులకు తలనొప్పిగా మారింది.