తప్పటడుగు: పొన్నాల, దాడి చేస్తే నో కేసు: హరీష్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నియోజకవర్గమైన గజ్వెల్లో ఇందిరా గాంధీకి అవమానం జరగడం దురదృష్టకరమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గురువారం అన్నారు. ఈటెల రాజెందర్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ మాటలదే తప్ప మూటలది కాదన్నారు.
రైతులు, విద్యుత్, ఇంటికో ఉద్యోగం విషయం మరిచిపోయారని చెప్పారు. ఎప్ఆర్బీఎం నిబంధనలు దాటి రూ.22వేల కోట్లు ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. మొదటి అడుగే తప్పుగా వేశారన్నారు. బడ్జెట్ తీవ్ర నిరాశను కలిగించిందన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకునే విషయంలో కేసీఆర్ ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారన్నారు.
కేంద్రం నుంచి నిధులు సాధించడంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారన్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించని కారణంగా రాష్ట్రానికి రావాల్సిన రూ.7 వేల కోట్ల నిధులు నిలిచిపోయాయన్నారు. అంతా అయిపోయిన తర్వాత నిధులు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తే ఎలాగన్నారు. గాంధీ భవన్లో పొన్నాల విలేకరులతో మాట్లాడారు. లక్ష కోట్ల బడ్జెట్తో ఆరు లక్షల కోట్లను ఎలా అమలు చేస్తారన్నారు.

దాడులు చేసినా కేసు పెట్టం: పొన్నాల
బెల్టు షాపుల పైన దాడులు చేసినా తాము గ్రామస్థుల పైన కేసులు పెట్టమని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లాలో అన్నారు. ఆయన గజ్వెల్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.
వందశాతం వైఫై: కేటీఆర్
హైదరాబాదుకు త్వరలో వంద శాతం వైఫై కనెక్టివిటీ కల్పిస్తామని ఆ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. ఇప్పటికే ఎనిమిది కిలోమీటర్లపరిధిలో వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయమన్నారు. వైఫై ఏర్పాటుకు టెలికాం కంపెనీల మధ్య పోటీ నెలకొందన్నారు. హైదరాబాదులోని ఐటీసీ కాకతీయ హోటల్లో జరిగిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ప్యాకింగ్ నేషనల్ సదస్సులో పాల్గొన్నారు.
తెరాస హామీలన్ని అమలు చేస్తుందన్నారు. రాబోయే కాలంలో నల్లా ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఎంగిలి మెతుకులు తినే అలవాటుందన్నారు. ఈటెలను అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు.
కాగా, కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. విగ్రహం మెడలో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. గురువారం ఉదయం దీనిని గమనించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇందిర విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.












Click it and Unblock the Notifications