పూర్ణిమ కచ్చితంగా తిరిగొస్తుంది: ఇదీ ఆమె తల్లిదండ్రుల ఆవేదన.. ఆశ..
పూర్ణిమ సాయి కచ్చితంగా తిరిగి తమ వద్దకు వస్తుందని ఇప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: కడుపున పుట్టిన బిడ్డ తల్లిదండ్రులను వద్దంటున్నా.. కన్నవారు మాత్రం ఆమె రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పూర్ణిమ సాయి కచ్చితంగా తిరిగి తమ వద్దకు వస్తుందని ఇప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కుమార్తె ఇష్ట ప్రకారం నడుచుకుంటామని వారు పేర్కొనడం గమనార్హం.
మరోవైపు పూర్ణిమ సాయి మాత్రం ఇంటికి వెళ్లనంటే, వెళ్లనంటూ మొండికేస్తున్న సంగతి తెలిసిందే. తాను ముంబై వెళ్లడం ఇంత పెద్ద వివాదానికి దారి తీయడంతో.. తిరిగి తల్లిదండ్రులకు ముఖం చూపించలేకే పూర్ణిమ ఇలా వ్యవహరిస్తుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అదీ కాపోతే తల్లిదండ్రులను వద్దనుకునేంత బలమైన కారణమేంటి? అన్నది అంతుపట్టడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నింబోలి అడ్డాలోని బాలికాసదన్ లో ఉన్న పూర్ణిమను బుధవారం రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా బాలికా సంరక్షణ కమిటీ(సీడబ్ల్యూసీ) ముందు హాజరుపరచనున్నారు. బాలిక ఎక్కడ ఉండాలనేది కమిటీ నిర్ణయించనుంది.
తొలుత పూర్ణిమకు కౌన్సెలింగ్ కు నిర్వహించి.. అప్పటికీ ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు నిరాకరిస్తే.. ఆమెను హోంలోనే ఉంచే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సాయంత్రం లోగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.