ఆ విగ్రహాలకు మాత్రమే పీవోపీ వాడొద్దా?: హైకోర్టు కీలక ఆదేశాలు, నోటీసులు
హైదరాబాద్: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వినాయక విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీవోపీ) వాడకాన్ని నిషేధించడంపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన మార్గదర్శకాలను, పీవోపీ నిషేధాన్ని సవాల్ చేస్తూ.. తెలంగాణ గణేశ్ మూర్తి కళాకార్ సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నందా ధర్మాసనం విచారణ చేపట్టింది.
పీవోపీని పూర్తిస్థాయిలో నిషేధించకుండా కేవలం వినాయక విగ్రహాల తయారీకి వాడొద్దనడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. విగ్రహాలు తయారు చేసే వారి ఉపాధి దెబ్బతింటోందని వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు తయారు చేసిన విగ్రహాలు అమ్ముకునేందుకు అనుమతివ్వాలని కోరారు.
పీవోపీని పూర్తిగా నిషేధించలేదని.. జలాశయాలు దెబ్బతినకుండా ఉండేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు కేవలం విగ్రహాల తయారీలో వాడొద్దని మార్గదర్శకాలు జారీ చేసినట్లు పీవోబీ తరఫు న్యాయవాది వెల్లడించారు.
అవసరమైతే విగ్రహాల ఎత్తు తగ్గించమనొచ్చు కానీ, నిషేధం లేకుండా పీవోపీ వాడొద్దని ఎలా చెబుతారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. విగ్రహాల తయారీకి మాత్రమే వాడొద్దని చెప్పడం ఏంటని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పీసీబీని, జీహెచ్ఎంసీని ఆదేశించింది. తదుపరి విచారణ జులై 21కి వాయిదా వేసింది.