మెటాపై హైకోర్టుకు వైసీపీ..! ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్రాలు..!
ఏపీలో విపక్ష వైఎస్సార్సీపీ(YSRCP)కి, అధికార కూటమికీ మధ్య సోషల్ మీడియాలో ఉధృతంగా వార్ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ ఫేస్ బుక్ అకౌంట్ ను మెటా బ్లాక్ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను కారణంగా చూపుతూ మెటా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులో పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ జరపబోతోంది.
వైఎస్సార్సీపీ ఫేక్ బుక్ అకౌంట్ ను నిలిపేయడానికి ఏ అధికారి ఉత్తర్వులు ఇచ్చారు, ఏ కంటెంట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నలతో పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ప్రభుత్వం మెటాకు పంపిన ఆదేశాల కాపీల్ని తమకు ఇవ్వాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఆయన కోరారు. ఇలా ఓ అకౌంట్ ను ప్రభుత్వ ఆదేశాలతో బ్లాక్ చేసినప్పుడు, సదరు ఆదేశాల కాపీని ఖాతాదారుడికి ఇవ్వాల్సి ఉన్నా మెటా అలా చేయకపోవడాన్ని వైసీపీ ప్రశ్నించింది. ఈ పిటిషన్ లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి, ఇతర అధికారుల్ని, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చింది.

వైఎస్సార్సీపీ ఫేస్ బుక్ పేజీని మెటా ఇలా ఏకపక్షంగా బ్లాక్ చేయడం చట్ట విరుద్దం, రాజ్యాంగ విరుద్దంగా ప్రకటించాలని పిటిషన్ లో హైకోర్టును కోరారు. తమ పిటిషన్ పై తీర్పు వచ్చే లోపు తమ ఫేస్ బుక్ ఖాతా బ్లాక్ చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తమకు అందించేలా మెటాను ఆదేశాలనించాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. మెటా అధికార పార్టీకి సహకరిస్తోందని, అందుకే తమ ఖాతా బ్లాక్ పై పూర్తి వివరాలు కూడా ఇవ్వడం లేదని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఫేస్ బుక్ అకౌంట్ బ్లాక్ చేశామని చెప్తున్న మెటా.. తమకు దీనిపై స్పందించే అవకాశం కూడా ఇవ్వలేదని పిటిషన్ లో వైసీపీ పేర్కొంది. ఇది అంతిమంగా చట్ట పరిధిని మించిన చర్య అని తెలిపింది.














Click it and Unblock the Notifications