అందుకే వెనుకబడుతున్నాం, విదేశాలకు వెళ్తున్నారు: ఓయులో ప్రణబ్
పరిశోధనలపై దృష్టి పెట్టకపోవడం వల్ల మనం వెనుకబడుతున్నామని, అలాగే, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదివిన వారు విదేశాలకు వెళుతున్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం అన్నారు.
హైదరాబాద్: పరిశోధనలపై దృష్టి పెట్టకపోవడం వల్ల మనం వెనుకబడుతున్నామని, అలాగే, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదివిన వారు విదేశాలకు వెళుతున్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల పైలాన్ను రాష్ట్రపతి ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓయు వందేళ్ల సంచికను రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్ అందచేశారు. అనంతరం ప్రణబ్ మాట్లాడారు.
ఓయు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. వందేళ్ల క్రితం మీర్ ఉస్మాన్ అలీ దీనిని ప్రారంభించారన్నారు. వందేళ్ల క్రితం ఇదే రోజు ఓ విజన్తో ఓయు ప్రారంభమైందన్నారు.
ఓయు శతాబ్ది ఉత్సవాలు: కేసీఆర్కు విద్యార్థుల వార్నింగ్, ప్రణబ్కు ఓకే
ఓయు అత్యున్నత విశ్వవిద్యాలయం అన్నారు. ఈ వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలోను అనేక మార్పులు వచ్చాయని తెలిపారు.
ఉన్నత విద్యలో ఇప్పటికే మనం ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పారు. ముఖ్యంగా పాత ఐఐటీల్లో 100 శాతం ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. ఉన్నత విద్యలో ఇంకా ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. ఐఐటీల్లో చదివిన వారికి వంద శాతం ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు.
పరిశోధనలపై దృష్టి పెట్టకపోవడం వల్లే మనం చాలా వెనుకబడుతున్నామన్నారు. ఉన్నత విద్యా సంస్థలను తప్పుపట్టడం తన ఉద్దేశ్యం కాదని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందించేలా పరిశోధనలు ఉండాలన్నారు. విద్యాలయాలు అందుకు నిలయాలు కావాలన్నారు.
ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదివిన వారు విదేశాలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమకాలిన సమస్యలను పరిష్కరించేలా బోధన ఉండాలన్నారు. ఇందులో విశ్వవిద్యాలయాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు.
వందల ఏళ్ల క్రితమే భారత దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలలో చదువుకునేందుకు విదేశాల నుంచి వచ్చే వారని చెప్పారు.