హైదరాబాద్: ప్రపంచంలో అతి పెద్ద ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్
ప్రఖ్యాత శ్రీరామచంద్ర మిషన్(ఎస్ఆర్సీఎం) ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారులో నిర్మితమైన ధ్యానకేంద్రాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం అధికారికంగా ప్రారంభించారు. శ్రీరామ చంద్ర మిషన్ 75వ వార్షికోత్సవం, సంస్థ ప్రథమ గురువైన శ్రీ రామచంద్ర(దాదాజీ) 147వ జన్మదినోత్సవాల నేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలో 'కన్హా శాంతివనం' పేరుతో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ధ్యానకేంద్రం ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది.
రామచంద్ర మిషన్ 75వ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఆధ్యాత్మిక ప్రపంచంలో దాదాజీ సేవలు ఎంతో గొప్పవని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కన్హా శాంతివనంలోని లక్ష మొక్కలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయని, ఇదొక పవిత్ర స్థలం అనే భావన కలిగిందని చెప్పారు. 150కిపైగా దేశాల్లో రామచంద్ర మిషన్ సేవలందిస్తుండటం, ధ్యానం ద్వారా ఆథ్యాత్మిక పురోగతి, ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతుండటం గొప్పవిషయమన్నారు.
కన్హా శాంతినిలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పలు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు కూడా పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి.. సోమవారం తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.