హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రాతియుగం నాటి ఆదిమానవుడి ఆనవాళ్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఆది మానవుడి ఆనవాళ్లు వెలుగుచూశాయి. వేల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ హైదరాబాద్ మహానగరంలో రాతియుగపు ఆనవాళ్లు లభించాయి. ఎక్కువగా సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతంలోని బీఎన్ఆర్ హిల్స్లోని తాబేలు గుండు ప్రాంతంలో ఈ ఆనవాళ్లు లభించడం పురవాస్తు శాఖ అధికారులను కూడా ఆశ్యర్యానికి గురిచేశాయి.
తాబేలుగుండు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పురావస్తు శాఖ అధికారులకు అక్కడ అనుకోకుండా ఆది మానవుల కాలంనాటి పనిముట్లు దొరకడం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాబేలు గుండు అనేది దాదాపు 20 మంది ఆది మానవులకు తాత్కాలిక ఆవాసంగా ఉపయోగపడి ఉండొచ్చని భావిస్తున్నారు పురావస్తు అధికారులు.

తాబేలు గుండు కింద దొరికిన రాతి గొడ్డళ్లు పాత రాతియుగపు గొడ్డళ్ల కంటే ఆధునికంగా ఉన్నాయని తెలిపారు. వీటిలో పెద్దది 12 సెంటీమీటర్ల పొడవు, 7.2 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. చూడటానికి సాధారణ రాళ్ళలాగే కనిపిస్తున్నా.. ఈ శిలాయుధాలు కొత్తరాతియుగాలనాటివని తేలింది. కొత్త రాతియుగపు మానవుల సాంకేతిక నైపుణ్యం కనిపిస్తోంది. ఆదిమానవులు ఆహార సేకరణలో భాగంగా వీటిని గొడ్డళ్ళుగా ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు.
చరిత్రకారులు శివనాగిరెడ్డి, హరగోపాల్ ఈ ప్రాంతంలో పురాతన ఆనవాళ్లు వెతుకుతుండగా ఈ శిలాయుగం నాటి వస్తువులు బయటపడ్డాయి. బయటపడ్డ రాతి ఆయుధాల ఆధారంగా హైదరాబాద్ మహా నగరంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని పురావస్తు అధికారులు చెబుతున్నారు. దీంతో మరిన్ని శిలాయుగం నాటి ఆనవాళ్లు బయటపడే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ఆదిమానవులకు సంబంధించిన ఆనవాళ్లు లభించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.












Click it and Unblock the Notifications