రిమాండ్ ఖైదీ మృతి: పోలీసు దెబ్బలకేనని భార్య కన్నీరుమున్నీరు
కరీంనగర్ జిల్లా కారాగారంలో రిమాండ్లో ఉన్న చోరీ కేసు నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు.
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కారాగారంలో రిమాండ్లో ఉన్న చోరీ కేసు నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే అతడు అస్వస్థతకు గురై మృతిచెందాడంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.
వేములవాడకు చెందిన కడమంచి వెంకటేశ్ (25)ను చోరీ కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా జులై 13న రిమాండ్ విధించడంతో జిల్లా కారాగారానికి తరలించారు. జులై 26న వెంకటేశ్కు జ్వరం రావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు.
వెంకటేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించాలని గురువారం సాయంత్రం జైలు అధికారులకు వైద్యులు సమాచారం అందించారు. రాత్రి 10 గంటల సమయంలో వరంగల్కు తరలించే ప్రయత్నం చేస్తుండగా వెంకటేశ్ మృతిచెందాడు. వెంకటేశ్ ఆరోగ్యం క్షీణిస్తోందని ముందే చెబితే త్వరగా వరంగల్ తరలించేవారమని జైలు పర్యవేక్షకులు శివకుమార్గౌడ్ చెప్పారు.
ఆసుపత్రి ఆర్ఎంవో శ్రీధర్ వివరణ కోరగా.. వరంగల్ తరలించడానికి ఎస్కార్టు ఆలస్యం కావడం, జ్వరం తీవ్రత ఎక్కువ కావడంతో అతడు మృతి చెందాడని చెప్పారు. ఇనుప మంచాలు అమ్ముకునే తన భర్తను అకారణంగా స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి జైలుకు తరలించారని వెంకటేశ్ భార్య రేణుక ఆరోపించింది. షాక్ ఇచ్చి రోకలి బండలు ఎక్కించారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఇద్దరు పిల్లలు సమ్మక్క (4), జంపన్న (8 నెలలు)లను ఎలా పెంచాలంటూ కన్నీరుమున్నీరైంది.