Fertilizer Factory: రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో అమ్మోనియం లీక్.. నిలిచిన ఉత్పత్తి..
పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో అమ్మోనియం ప్లాంట్ గ్యాస్ లీక్ అయింది. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచి యూరియా ఉత్పత్తి ప్రక్రియ స్తంభించింది. మరమ్మతులు చేసి ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. కాగా రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడానికి ఈనెల 12 ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామగుండం రానున్నారు. ప్రధాన మంత్రి పర్యటన ముందు ఉత్పత్తి నిలిచిపోవడంతో చర్చనీయంశంగా నిలిచింది.
ప్రధాన మంత్రి తన పర్యటనలో ఎరువుల పరిశ్రమను జాతికి అంకితం ఇవ్వడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మోడీ రాక సందర్బంగా రామగుండం, గోదావరిఖని అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలను తరలించడానికి బీజేపీ ప్లాన్ చేస్తుంది. 50 వేల మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

అతిపెద్ద ఎరువుల కర్మాగారం రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని , దానిని జాతికి అంకితం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని రైతులకు తెలియజేసే ప్రయత్నం లో భాగంగా బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. అంతేకాదు ప్రధాని రామగుండం పర్యటనపై రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక పనులపై ప్రజలకు తెలియజేసేలా 11వ తేదీన విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు.
అయితే ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందిందా లేదా తెలియరాలేదు. ఆర్ఎఫ్సీఎల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు తెలంగాణ ప్రభుత్వం వాటాదారుగా ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి 11 శాతం వాటా ఉంది.












Click it and Unblock the Notifications