టీఎస్ఆర్టీసీ సమ్మెపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు: సాయంత్రం విచారణ
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సమ్మె విరమింపజేసేలా ఆర్టీసీ సంఘాలను ఆదేశించాలని ఓయూ రీసెర్చ్ స్కాలర్ సురేంద్ర సింగ్ పిటిషన్ దాఖలు చేశారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఆదివారం మధ్యాహ్నం 4గంటలకు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నివాసంలో విచారణ చేపట్టనుంది.
ఆర్టీసీ సమ్మె: 6 లోపు విధుల్లో చేరింది ఎంతమందో తెలుసా?
ఇది ఇలా ఉండగా, అక్టోబర్ 5 శనివారం నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సమ్మె విరమించాలని హెచ్చరికలు చేసినప్పటికీ కార్మిక సంఘాలు వెనక్కితగ్గలేదు. సర్కారు బెదిరింపులకు తలొగ్గేది లేదని, తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ తాము సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
విధుల్లో చేరిన 160మంది
కాగా, ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో కొందరు మాత్రం విధుల్లో చేరారు. ఈ క్రమంలో శనివారం(అక్టోబర్ 5) సాయంత్రం 6 గంటల లోపు 160 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరినట్లు యాజమాన్యం ప్రకటించింది. వీరిలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు, సూపర్వైజర్లు, ఆఫీస్ స్టాఫ్, మెకానిక్లు ఉన్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
శనివారం సాయంత్రం 6 గంటల లోపు విధుల్లో చేరాలని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినప్పటికీ కార్మిక సంఘాలు సమ్మెను కొనసాగించాలనే నిర్ణయించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
కాగా, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మరోసారి టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలకు హెచ్చరిక జారీ చేశారు. శనివారం(అక్టోబర్ 5) సాయంత్రం 6 గంటల లోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే 160 మంది ఉద్యోగులు విధుల్లో చేరడం గమనార్హం.
అయితే, విధుల్లో చేరని పక్షంలో ఇకపై వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా ప్రభుత్వం పరిగణించదని మంత్రి తేల్చి చెప్పారు. అంతేగాక, భవిష్యత్లో కూడా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీలోకి తీసుకునేది లేదని మంత్రి అజయ్ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణాకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.