పువ్వాడ అజయ్, పోలీసులు జైలుకెళ్లక తప్పదు: కిషన్ రెడ్డి, సాయిగణేష్ కుటుంబానికి పరామర్శ
ఖమ్మం: బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్యకు కారణమైనవారిని వదిలిపెట్టమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు మాఫియాగా మారి ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. సాయిగణేష్ కుటుంబసభ్యులను కిషన్ రెడ్డి పరామర్శించారు.
పువ్వాడ అజయ్ సహా పోలీసులు జైలుకే: కిషన్ రెడ్డి
సాయి గణేష్ ఆత్మహత్యకు కారణమైన మంత్రి పువ్వాడ అజయ్, ఇతర పోలీసు అధికారులు జైలుకు వెళ్లకతప్పదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. తెలంగాణలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రైస్ మాఫియా పెరిగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ప్రతిపక్ష పార్టీలు వార్డుల్లో ఖర్చు చేయడం లేదని, అనేక సర్వేలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వస్తున్నాయన్నారు.
టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లోనే పథకాలు: కిషన్ రెడ్డి
రైతుబంధు నుంచి దళితబంధు వరకు టీఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లోనే అమలవుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఒక్కడి కారణంగానే తెలంగాణ రాలేదని, 1200 మంది ఆత్మబలిదానాలు వృధాగా పోవన్నారు. గత రెండు ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఎలా గెలిపించారో.. వచ్చే ఎన్నికల్లో అలాగే ఓడిస్తారన్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం, అవినీతి అరాచక పాలనపై బీజేపీ పోరాటం చేస్తుంటే.. తెలంగాణ సెంటిమెంటుకు లింక్ పెడుతుందనని మండిపడ్డారు.
మంత్రి కేటీఆర్కు కిషన్ రెడ్డి సవాల్
రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో.. కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమా? అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు. కరోనా వ్యాక్సిన్లు కానీ, టీఆర్ఎస్ సర్కారు తెస్తున్న 90 శాతం అప్పులు రాష్ట్రానికి కేంద్రం ఇస్తుందని తెలిపారు.
బీజేపీపై పథకం ప్రకారం వ్యక్తిగత దూషణలతోపాటు పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల పేరుతో టీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేశారని.... రాష్ట్రంలో ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తుంటే మాత్రం అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ నియంత పాలనకు అంతం.. బీజేపీదే అధికారం: కిషన్ రెడ్డి
ఇటీవల రైతు ఉద్యమంలో మృతి చెందిన పంజాబ్ రైతు కుటుంబాలకు పరిహారమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ కోసం పోరాడి ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులకు ఏం ఇచ్చారని ప్రశ్నించారు. బీజేపీపై ఎంత బురదజల్లినా.. రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా... వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
రానున్న రోజుల్లో టీఆర్ఎస్ నియంతృత్వ, నిజాం, అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేపీ మరింతగా ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో ప్రజా పాలన బీజేపీ తీసుకురానుందని కేంద్రమంత్రి తెలిపారు.