కెసిఆర్ ఎజెండానే పునర్నిర్మాణం: తెలంగాణకు ప్రమాద సంకేతాలే...
చాలావరకు మేదావులు, రచయితలు, కవులు, జర్నలిస్టులు ప్రభుత్వంతో కలిసి ప్రయాణం చేస్తున్నందువల్ల.. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజావాదాన్ని భుజానికెత్తుకుని నిలబడేవారు కరువయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణంలో అధికారాన్ని అనుభవిస్తున్నవారి రాజకీయ పునాదులు బలపడుతున్నాయి తప్పితే.. సామాజిక తెలంగాణ ఆకాంక్షలు ఎంతవరకు నెరవెరుతున్నాయనేది సిసలైన తెలంగాణ ఉద్యమకారుల ప్రశ్న. మనవారెవరో.. పరాయివారెవరో తేల్చుకోలేని రీతిలో రాజకీయ సమీకరణాలు మారిపోయిన తర్వాత పార్టీ ఎజెండాలే తప్పితే.. ప్రజా ఎజెండాలను మోసే నాయకులు కనిపించడం లేదు.
గతం మీద నిందల్ని నెట్టేయడం పలాయనవాదమే అవుతుంది తప్పితే ప్రజావాదం కాదు. పునర్నిర్మాణంలో వ్యతిరేక శక్తులు చొరబడినప్పుడే.. తెలంగాణ రాజకీయాల గతి ఎటువైపు వెళ్తుందనేది అవగాహనలోకి వచ్చింది.
నిజానికి కొన్ని ఉద్యమ శక్తులు ప్రభుత్వంలో జీర్ణమవడం.. కోదండరాం లాంటి వ్యక్తులు జేఏసీని ఒక స్వీయ రాజకీయ శక్తిగా మలచకపోవడం పునర్నిర్మాణాన్ని ఏకపక్ష వైఖరిలోకి నెట్టేసే ప్రమాదాన్ని కల్పించాయి.
అప్పటి మేధావులేరి?:
ఒక రాజకీయ ప్రక్రియ ముగిసి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాక.. అక్కడి వ్యవహారాన్ని కేవలం రాజకీయపార్టీలకు, పాలక వర్గాలకు వదిలేయడం వల్ల అక్కడ ఎలాంటి సామాజిక మార్పు పెద్దగా కనిపించదన్నది చారిత్రక సత్యం. మేదావులు, కవులు, కళకారులు, పాత్రికేయులు, రచయితలు ఎవరికి వారు నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిందే.
కానీ తెలంగాణ విషయంలో అలా జరగలేదు. చాలావరకు మేదావులు, రచయితలు, కవులు, జర్నలిస్టులు ప్రభుత్వంతో కలిసి ప్రయాణం చేస్తున్నందువల్ల.. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజావాదాన్ని భుజానికెత్తుకుని నిలబడేవారు కరువయ్యారు. ఒకప్పుడు తెలంగాణ ఆకాంక్షలపై సూటిగా ప్రశ్నించిన గొంతుకలన్ని ఇప్పుడు ప్రభుత్వం చాటున నక్కిపోయాయి.
నెట్టేద్దామనుకుంటే కుదరదు:
తెలంగాణ పట్ల చిత్తశుద్ది లేని ప్రతిపక్షాలను జనం విశ్వసించే పరిస్థితిలో లేరు. అలా అని టీఆర్ఎస్ ఏకపక్ష పోకడలను కూడా వారు సహించలేకపోతున్నారు. ఇది గుర్తించని అధికార పార్టీ కేవలం గత పాలకులపై నిందలు మోపినంత మాత్రాన ప్రయోజనం లేదు.
భౌగోళిక తెలంగాణ ఎవరి లక్ష్యాలకు ఉపయోగపడుతున్నది? అన్న ప్రశ్నకు సమాధానం దొరికిన తర్వాత.. ఇక్కడి ఆలోచనాపరులు పూర్తిగా విఫలమైనట్లుగానే కనిపిస్తోంది. కేవలం ఒక విముక్తి వరకు మాత్రమే పోరాడి ఆ తర్వాతి సామాజిక స్థితి గతులను అంచనా వేయడంలో వారు వైఫల్యం చెందారు. కాబట్టే తెలంగాణ ఏకపక్షరాజకీయాలకు కేంద్రంగా మారింది. వ్యక్తి కేంద్రంగా ప్రణాళికలు రూపొదిద్దుకునే దుస్థితి ఏర్పడింది.
ఉద్యమ ఎజెండా అమలవుతోందా?:
ఒక సమూహ స్ఫూర్తి నుంచి పెల్లుబికిన ఉద్యమ ఎజెండా స్థానంలో ఫక్తు రాజకీయ ధోరణి ప్రస్తుతం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యమానికి ఊతమిచ్చిన విద్యావంతులకు, జేఏసీలకు పునర్నిర్మాణంలో ప్రాతినిధ్యం దక్కకపోవడమే ఇందుకు నిదర్శనం. వ్యతిరేక శక్తులకు లభించిన ప్రాతినిధ్యం, ప్రాముఖ్యత.. తెలంగాణ కోసం ఉద్యమించిన శక్తులకు లేకపోవడం ఉద్యమ ఎజెండా పక్కదారి పట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
కేసీఆర్ ముందు చూపు:
తెలంగాణ పునర్నిర్మాణం సంగతి పక్కనపెడితే.. టీఆర్ఎస్ పునర్నిర్మాణాన్ని మాత్రం కేసీఆర్ అద్భుతంగా మలుచుకోగలిగారు. ప్రత్యర్థుల ఊసే లేకుండా అప్రతిహతంగా సాగిపోతున్నారు. ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం కేసీఆర్ ముందు చూపుకు అద్దం పడుతుంది. వ్యతిరేక శక్తులను కూడా పార్టీలో చేర్చుకోవడం వెనుక.. తెలంగాణలో ఏకపార్టీని నడిపించాలనే లక్ష్యమే కనిపిస్తుంది. తద్వారా తెలంగాణ రాజకీయమంతా తన గుప్పిట్లోనే ఉండిపోతుంది.
ప్రశ్నించే ఉస్మానియా:
ప్రతిపక్షాలు విఫలమైన చోట ఉస్మానియా యూనివర్సిటీయే అసలైన ప్రతిపక్షంగా నిలిచిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. రాజకీయ ప్రత్యర్థులను చీల్చి చెండాడే కేసీఆర్.. విద్యార్థి లోకం ముందు మాత్రం తలవంచక తప్పలేదు. దీన్నిబట్టి చూస్తే.. తెలంగాణ పునర్నిర్మాణాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నది ఒక్క విద్యార్థి చైతన్యమేనని బలంగా చెప్పవచ్చు.
ఏదేమైనా తెలంగాణ పునర్నిర్మాణ ఆకాంక్ష అనేది వ్యక్తి పరిధిలోని వ్యవహారంగా కాకుండా.. సమస్త తెలంగాణ ప్రజలకు సంబంధించిన వ్యవహరంగా పాలక వర్గాలు గుర్తుపెట్టుకుంటే స్వరాష్ట్రానికి మేలు జరుగుతుంది.