జేఎన్టీయూ వద్ద ర్యాగింగ్: బీటెక్ విద్యార్థుల అరెస్ట్
హైదరాబాద్: కూకట్పల్లిలోని జేఎన్టీయూ వద్ద ర్యాగింగ్కు పాల్పడుతున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు బస్టాప్లో యువతులను వేధిస్తుండగా పట్టుకున్నట్లు కూకట్పల్లి పోలీసులు తెలిపారు.
వీరిని అదుపులోకి తీసుకుని, కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టినట్లు పోలీసులు చెప్పారు. ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రిషికేశ్వరి ఆత్మహత్య ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. దీంతో ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ర్యాగింగ్ చేస్తే విద్యాలయాల నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడమంటూ కళాశాలలు కూడా హెచ్చరిస్తున్నాయి.
వృద్ధురాలి సజీవ దహనం
హైదరాబాద్ నగరంలోని నేరేడిమెట్లో ఓ వృద్ధురాలు సజీవ దహనమైంది. ప్రమాదవశాత్తు ఆమె ఉంటున్న గుడిసెకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. గుడిసెలో ఉన్న ఆమె కూడా సజీవ దహనమైంది.
మోసాలకు పాల్పడుతోన్న కానిస్టేబుల్ అరెస్టు
మోసాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై రంగరాజు అనే కానిస్టేబుల్ను పోలీసులు అరెస్టు చేశారు. తాను సీబీసీఐడీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నానని ఉద్యోగాలు ఇప్పిస్తానని కొందరు అమ్మాయిలను నమ్మించాడు. వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు.
ఉద్యోగాలు ఇప్పించక పోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగరాజును పోలీసులు అరెస్టు చేశారు. కాగా, నిందితుడు రంగరాజు స్పెషల్ బెటాలియన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు.